2 April, 2026 | 2:59 AM

తెలంగాణకు రెండు జాతీయ అవార్డులు

02-04-2026 01:07 AM
  1. గుడ్ గవర్నెన్స్, విమెన్ ఫ్రెండ్లీ పంచాయతీ పురస్కారాలు
  2. మంత్రి సీతక్క అభినందన

హైదరాబాద్, ఏప్రిల్ 1 (విజయక్రాంతి): గ్రామీణాభివృద్ధి, సుస్థిర పరిపాలనలో విశిష్ట ప్రతిభ కనబరుస్తూ తెలంగాణ రాష్ట్రంలోని పంచాయతీలు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయి. కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ప్రకటించిన ‘దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాలు’ కింద రాష్ట్రానికి చెందిన రెండు పంచాయతీలు అవార్డులు సాధించాయి. వికారాబాద్ జిల్లా కోటేపల్లి మండలం మోతుకుపల్లి గ్రామ పంచాయతీ ‘గుడ్ గవర్నెన్స్’ విభాగంలో అవార్డు సాధించింది.

గ్రామస్థాయిలో పారదర్శక పరిపాలన, ప్రజల భాగస్వామ్యం, అభివృద్ధి కార్యక్రమాల అమలులో చూపిన ప్రతిభకు గుర్తింపు లభించింది. సంగారెడ్డి జిల్లా, మండలం ఫసల్వాడి గ్రామ పంచాయతీ ‘విమెన్ ఫ్రెండ్లీ పంచాయతీ’ విభాగంలో జాతీయ అవార్డుకు ఎంపికైంది. మహిళా సాధికారత, భద్రత, సంక్షేమ కార్యక్రమాల అమలులో చూపిన కృషికి ఈ అవార్డు దక్కింది.

రెండు విభాగాల్లో తెలంగాణకు అవార్డులు రావడం పట్ల పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేస్తూ, గ్రామీణాభివృద్ధి, పారదర్శక పాలన, మహిళా సాధికారత దిశగా మా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు నిదర్శనమన్నారు. అవార్డులు అందుకున్న మోతుకు పల్లి, ఫసల్వాడి గ్రామ పంచాయతీల ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్థాయి సిబ్బందిని మంత్రి అభినందించారు. ఇలాంటి విజయాలు ఇతర పంచాయతీలకు స్పూర్తిగా నిలుస్తాయని సీతక్క పేర్కొన్నారు.