అధికార పార్టీ నేతల ఒత్తిడితోనే..
రాజ్యసభలో ప్రస్తావించిన బీజేపీ ఎంపీ లక్ష్మణ్
హైదరాబాద్, ఫిబ్రవరి 10 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి సొంత జిల్లా మహబూబ్ నగర్లో మంత్రి, అధికార పార్టీ నేతల ఒత్తిడి మేరకు గిరిజన అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్య చేసుకోవడం దారుణమని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విచా రం వ్యక్తం చేశారు. మంగళవారం మక్తల్ మున్సిపాలిటీ ఎన్నికల్లో 6వ వార్డు నుంచి బీజేపీ తరపున పోటీ చేస్తున్న మహదేవప్ప ఆత్మహత్య చేసుకున్న సంఘటనను రాజ్యసభలో ప్రస్తావించినట్లు తెలిపారు. గెలవడం ఖాయం...గెలిచిన తర్వాత కూడా తనను అధికార పార్టీ వేధిస్తుందని, తన భార్యతో స్పష్టంగా చెప్పి మహదేవప్ప ఆత్మహత్య చేసుకున్నాడన్నారు.
ఈ దారుణ సంఘటనను సభా ముఖంగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తెచ్చానన్నారు. బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగం పుస్తకాన్ని పట్టుకుని దేశమంతా తిరుగుతున్న రాహుల్ గాంధీ, తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ రకంగా ప్రాజాస్వామ్యాన్ని అవహేళన చేసేలా దురాగతాలకు పాల్పడం తీవ్ర అభ్యంతరకరమన్నారు. దీనికి కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని ఎంపీ లక్ష్మణ్ డిమాండ్ చేశారు.




