02-06-2025 12:05:57 AM
ఎస్టీయూ నాయకులు
మంచిర్యాల, జూన్ 1 (విజయక్రాంతి) : జిల్లాలో ఏకపక్షంగా ఉపాధ్యాయుల సర్దుబాటు సమంజసం కాదనీ స్టేట్ టీచర్స్ యూనియన్ (ఎస్టీయు) జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బట్టారి వెంకటేశ్వర్లు, చీపెల్లి బాపు ఆదివారం డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచుతామని గతంలో చెప్పినటువంటి ప్రభుత్వం అలా కాకుండా జీవో ఎంఎస్ నెంబర్ 25ను పరిగణలోకి తీసుకొని మే 28న 1267 అనే ప్రొసీడింగ్ ను విడుదల చేస్తూ సర్దుబాటు పేరిట ఉత్తర్వులు జారీ చేయడం సమంజసం కాదన్నారు.
అభ్యాసన సామర్ధ్యాలను పెంచాలని అందుకు ఉపాధ్యాయులు బాధ్యత వహించాలని చెప్పిన అధికారులు సర్దుబాటు పేరిట ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు లేకుండా చేయడానికి పూనుకోవడం సరైనటువంటి పద్ధతి కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు తగ్గిపోతుందని ఈ విద్యా సంవత్సరం నమోదు పెంపు కోసం సమిష్టిగ కృషి చేద్దామని చెప్పిన విద్యాశాఖ అధికారులు ఏకపక్షంగా సర్దుబాటు ఉత్తర్వులు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు.
పాఠశాల ప్రారంభం కాకుండానే విద్యార్థుల నమోదు పట్టించుకోకుండా జూన్ 12 నాటికి సర్దుబాటు చేసినట్లయితే నూతనంగా జూన్ నుంచి జూలై వరకు దాదాపు చాలా పాఠశాలలో పిల్లలు ప్రవేశాలు జరిగే అవకాశం ఉంటుందన్నారు. గత సంవత్సరంలో పదవ తరగతి విద్యార్థులు అందరూ వెళ్లిపోవడం జరిగిందనీ, మళ్లీ కొత్త విద్యార్థులు రావడం జరుగుతుంది కానీ ప్రభుత్వం జూన్ 12 వరకే సర్దుబాటు ప్రక్రియ పూర్తి చేయాలని, 15 రోజులలోనే కంప్లీట్ చేయాలని చెప్పడం ఇది సహేతుకమైనటువంటి చర్యగా భావించడం జరుగుతుందన్నారు.
ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలను బలోపేతం చేయాలంటే తరగతికి అందరూ ఉపాధ్యాయులు ఉన్నట్లయితేనే విద్యార్థుల యొక్క సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి సర్దుబాటు పేరిట ఇలా తరలించడం ఇలా నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదన్నారు.
వీలైతే ఆగస్టు వరకు వేచి చూసి ఆ తర్వాత సర్దుబాటు చేసినట్లయితే బాగుంటుందని, ప్రాథమిక పాఠశాలలో పది మంది, లోపు ఒక ఉపాధ్యాయుడు 11 నుంచి 60 మంది లోపు ఉంటే ఇద్దరు ఉపాధ్యాయులు ఉండాలని చెప్పడం అశాస్త్రీయమైనటువంటి పద్ధతి, ఎందుకోసమంటే ప్రతి తరగతికి 4,5 సబ్జెక్టులు ఉంటాయి రోజు 5 తరగతులకు 20 సబ్జెక్టులు ఒక ఉపాధ్యాయుడు అంతమంది విద్యార్థులకు అన్ని సబ్జెక్టులు రోజు ఎలా చెప్పగలడు ఇది సాధ్యమైనటువంటి పని కాదు విద్యారంగ అభివృద్ధి చెందాలి అన్నప్పుడు గతంలో ప్రభుత్వం వాగ్దానం చేసినట్లుగా ప్రతి తరగతి కి ఒక ఉపాధ్యాయుని ఇచ్చినట్లయితే ఆటోమెటిగ్గా విద్యార్థుల సంఖ్య గననీయంగా పెరిగే అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేటెడ్ అధ్యక్షులు అర్చనపెళ్లి సత్తయ్య, జిల్లా అదనపు కార్యదర్శి సుమన్, తదితరులు పాల్గొన్నారు.