24 July, 2026 | 3:48 PM

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వెంటనే రాజీనామా చేయాలి

24-07-2026 02:44 PM

బోధన్,(విజయక్రాంతి): బోధన్‌లో విద్యాసంస్థల బంద్ విజయవంతం దేశవ్యాప్తంగా విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసే విద్యా విధానాలు, విద్యార్థి ఉద్యమాలపై జరుగుతున్న నిర్బంధ చర్యలను నిరసిస్తూ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను వెంటనే పదవి నుంచి భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర వామపక్ష విద్యార్థి సంఘాల (AIFDS,AISB,PDSU) పిలుపు మేరకు నిర్వహించిన రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్ బోధన్ పట్టణంలో విజయవంతమైంది. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల విద్యార్థులు బంద్‌కు విశేషంగా సహకరించారు.

ఈ సందర్భంగా AIFDS  జిల్లా కన్వీనర్ ఎం.డి. మోసిన్ మాట్లాడుతూ, దేశ విద్యార్థులు, యువత తమ హక్కుల కోసం ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడుతుంటే వారిపై లాఠీచార్జీలు, బాష్పవాయువు ప్రయోగాలు, అక్రమ నిర్బంధాలు చేయడం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని అన్నారు. విద్యార్థుల రక్తం చిందించడం దేశభక్తి కాదని, వారి సమస్యలను పరిష్కరించడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద కొనసాగుతున్న విద్యార్థుల ఉద్యమాన్ని అణచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం పోలీసు బలగాలను ఉపయోగించడం అత్యంత దుర్మార్గమని, పార్లమెంట్ మార్చ్ సందర్భంగా విద్యార్థులు, యువతపై జరిగిన లాఠీచార్జీ, బాష్పవాయువు ప్రయోగం, అరెస్టులు, దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.

దేశంలో బీజేపీ ప్రభుత్వం బ్రిటీష్ పాలనను తలపించే విధంగా నిరంకుశంగా వ్యవహరిస్తోందని, ప్రశ్నించే గొంతుకలను అణచివేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని అన్నారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించకుండా ఉద్యమాలను అణచివేయడం ద్వారా ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవాలని చూస్తోందని విమర్శించారు. విద్యార్థులు, యువతపై జరిగిన దాడులకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెంటనే మంత్రివర్గం నుంచి భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించి, ఉద్యమకారులపై నమోదు చేసిన కేసులను ఉపసంహరించుకోవాలని కోరారు. న్యూఢిల్లీలోని జంతర్ మంతర్‌లో కొనసాగుతున్న విద్యార్థి ఉద్యమానికి సంఘీభావంగా నిర్వహించిన రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్‌ను విజయవంతం చేసిన విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు, మేధావులు, ప్రజాసంఘాల నాయకులు, ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం భవిష్యత్తులో కూడా పోరాటాలు మరింత ఉధృతంగా కొనసాగుతాయని హెచ్చరించారు.