28-06-2025 02:57:23 PM
కరీంనగర్, (విజయక్రాంతి): తెలుగు తేజం, గొప్ప రాజనీతిజ్ఞుడు, భారతరత్న, ప్రధానమంత్రి పదవిని చేపట్టిన ఏకైక తెలుగు వాడైన మన తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు జయంతి(P. V. Narasimha Rao Jayanti) సందర్భంగా ఆ మహానుభావుడికి నివాళి అర్పిస్తున్నానని కేంద్ర హోంశాఖ సహాయం మంత్రి బండి సంజయ్ కుమార్(Union Minister Bandi Sanjay Kumar) ఒక ప్రకటనలో తెలిపారు. నిరాడంబర జీవితానికి, రాజనీతికి నిలువెత్తు నిదర్శనం స్వర్గీయ పీవీ నరసింహారావు అని, ఆ మహానుభావుడు దేశానికి చేసిన సేవల గురించి ప్రతి ఒక్కరూ స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. పీవీ నర్సింహారావు రాజకీయవేత్త మాత్రమే కాదని... బహుభాషావేత్త, కవి, రచయిత, జర్నలిస్టు, అనువాదకుడిగా అపార జ్ఞానం సంపాదించిన మహోన్నతుడని, తన భూములను పేదలకు పంచి ఉమ్మడి రాష్ట్రంలో భూ సంస్కరణలకు బీజం వేసిన భూదాత అని తెలిపారు.
దేశం ఆర్ధికంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో ప్రధానిగా పీవీ చేపట్టిన సంస్కరణలు దేశ ఆర్ధిక ప్రగతికి పునాది వేశాయని పేర్కొన్నారు. కాకతీయ పత్రికలో జర్నలిస్టుగా పీవీ తన జీవిత ప్రస్తానాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగారని, మంత్రిగా, ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రిగా, ప్రధాన మంత్రి వరకు అనేక ఉన్నత పదవులు చేపట్టి ఆ పదవులకే వన్నె తెచ్చిన నాయకుడని కొనియాడారు. భారత దేశంలో రాజకీయాల్లో అపర చాణక్యుడు అనగానే సామాన్య ప్రజలకు కూడా గుర్తుకొచ్చే పేరు పీవీ అని తెలిపారు. హైదరాబాద్ సంస్థానాన్ని భారత్ లో కలిపేందుకు జరిగిన ‘తెలంగాణ విమోచన ఉద్యమం’లో(Telangana Liberation Movement) కీలక పాత్ర వహించి అఖండ భారతావని కోసం క్రుషి చేసిన మహనీయుడు మన పీవీ...తెలుగు దనానికే ఠీవీ. హంగు, ఆర్భాటాలు లేని సాదా సీదా నేత. ఎదిగే కొద్దీ ఒదిగి ఉంటూ దేశానికి ఆదర్శంగా నిలిచిన మహా నేత అని పేర్కొన్నారు.
పీవీ నర్సింహారావు దేశానికి చేసిన సేవలను కాంగ్రెస్, బీఆర్ఎస్ విస్మరించాయని, మాజీ ప్రధాని పీవీ(Former Prime Minister P.V) చనిపోతే ఢిల్లీలో అంత్యక్రియలు జరగనీయకుండా అవమానించిన పార్టీ కాంగ్రెస్ అని, ఎన్నికలప్పుడు మాత్రమే పీవీ పేరును వాడుకుని, ఆ తరువాత ఆయనను పూర్తిగా విస్మరించిన పార్టీ బీఆర్ఎస్ అని తెలిపారు. పీవీ జన్మించిన వంగరలో పీవీ జ్ఝాన వేదికను ఏర్పాటు చేస్తామని ప్రకటించిన నాలుగేళ్లయినా నేటికీ వాటిని పూర్తి చేయకపోవడం బాధాకరమని, కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) ఏర్పడి 18 నెలలైనా పీవీ జ్ఝాన వేదికతోపాటు పీవీ ధ్యాన మందిరం, పీవీ విగ్రహ ఏర్పాటు వంటి పెండింగ్ పనులను పూర్తి చేయకపోవడం శోచనీయమన్నారు. ఇకనైనా వాటిని సత్వరమే పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ మహనీయుడు పీవీ నర్సింహారావుకు ఘన నివాళి అర్పిస్తున్నానని ఏందిరా హోంశాఖ సహాయం మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు.