calender_icon.png 21 June, 2025 | 10:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కవ్వంపల్లి విజ్ఝప్తి మేరకు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ను సందర్శించిన కేంద్రమంత్రి బండి

21-06-2025 05:23:19 PM

గన్నేరువరం బ్రిడ్జిపై చర్చ...

కరీంనగర్ (విజయక్రాంతి): మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ(MLA Kavvampally Satyanarayana) విజ్ఝప్తి మేరకు  కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్(Union Minister Bandi Sanjay Kumar) శనివారం తిమ్మాపూర్ ఎల్ఎండీ కాలనీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని సందర్శించారు. తిమ్మాపూర్ మండలంలోని రామక్రిష్ణానగర్ కాలనీలో జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మించిన రోడ్డును ప్రారంభించేందుకు వెళుతున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కు కవ్వంపల్లి స్వాగతం పలికి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులోకి తోడ్కొని వెళ్లారు.

ఈ సందర్భంగా గన్నేరువరం మండలం గుండ్లపల్లి పోతారం నుండి బావూపేట, ఖాజీపేట వరకు హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణం ప్రతిపాదనలపై చర్చించారు. మానేరు నదిపై హైలెవెల్ బ్రిడ్డి నిర్మించాలని స్థానిక ప్రజలంతా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారని ఎమ్మెల్యే ప్రస్తావించగా, తప్పకుండా మండల ప్రజల కల నెరవేర్చుతామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం సహకరిస్తే ఎప్పుడో గన్నేరువరం బ్రిడ్జి పూర్తయ్యేదని, రాజకీయ కక్షతో వ్యవహరిస్తూ ప్రజలను ఇబ్బందికి గురిచేసిందని బండి సంజయ్ చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం నుండి హైలెవెల్ బ్రిడ్జి ప్రతిపాదనలు కేంద్రానికి వెళ్లాయన్నారు. మొత్తం రూ.77 కోట్లతో 18 కిలోమీటర్ల పొడవునా నిర్మించేందుకు కేంద్రం సుముఖంగా ఉందన్నారు.

ఈ మేరకు కేంద్ర రహదారుల మౌలిక సదుపాయాల నిధి(సీఆర్ఎఫ్ఐ) కింద ఈ బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేయబోతున్నట్లు తెలిపారు. అతి త్వరలోనే కేంద్రం ఆమోదం తెలపనుందని, గన్నేరువరం ప్రజల చిరకాల వాంఛ నెరవేరబోతోందని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే కవ్వంపల్లితో కలిసి తిమ్మాపూర్ రామక్రిష్ణానగర్ కాలనీకి విచ్చేసిన కేంద్రమంత్రి బండి సంజయ్ జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను కవ్వంపల్లితో కలిసి సంయుక్తంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ... తిమ్మాపూర్ మండలంలో మొత్తం 1 కోటి 10 లక్షల రూపాయల జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో పలు గ్రామాల్లో  రోడ్లను నిర్మించినట్లు తెలిపారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఇప్పటికే దాదాపు 31 కోట్ల 12 లక్షల రూపాయల విలువైన పనులు జరుగుతున్నాయని వివరించారు. అందులో భాగంగా తిమ్మాపూర్ మండలంలో ఈ ఏడాది 1 కోటి 10 లక్షల రూపాయలను ఖర్చు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోనే సి ఆర్ ఐ ఎఫ్ కింద 291 కోట్లను ఖర్చు చేసి 1341 కిలోమీటర్ల మేరకు రోడ్లను నిర్మించామన్నారు.  జాతీయ రహదారుల నిర్మాణం కోసం దాదాపు 5 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు.