21 June, 2026 | 8:21 PM

హక్కుల సాధనకు ఐక్య ఉద్యమాలు

16-06-2024 12:56 AM
  • బీసీ జనసభ అధ్యక్షుడు రాజారామ్ యాదవ్ 

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 15 (విజయక్రాంతి): సమగ్ర కులగణన జరిపి స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని బీసీ జనసభ అధ్యక్షుడు రాజారామ్ యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  శనివారం ఇందిరాపార్క్ వద్ద బీసీ కుల సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీ ఓట్లతో అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి బీసీ కులగణన, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించకుండానే స్థానిక ఎన్నికలు నిర్వహించాలనే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.

ఎన్నికల సమయంలో కామారెడ్డిలో జరిగిన బీసీ డిక్లరేషన్ సభలో కులగణన చేపడతామని చెప్పి ఆరు నెలలు అవుతున్నా ఆ విషయంలో ఇప్పటివరకు కదలిక లేకపోవడం చూస్తుంటే బీసీల పట్ల సీఎం చిత్తశుద్ధి అర్థమవుతుందని అన్నారు. బీసీ హక్కుల సాధన కోసం తెలంగాణ ఉద్యమం లాగా గ్రామగ్రామాన ఉద్యమించాల్సిన అవసరముందని, బీసీలకు రావాల్సిన హక్కులను పోరాడి సాధించుకుందామని పిలుపునిచ్చారు. ధర్నాలో ఆర్ కృష్ణయ్య, ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.