ఇరాన్పై బీకర దాడులు
చమురు నిల్వ కేంద్రాలే లక్ష్యం
టెహ్రాన్లోని 5చమురు కేంద్రాలు ధ్వంసం
నలుగురు మృతి.. పలువురికి గాయాలు
కొనసాగుతున్న అమెరికా, ఇజ్రాయెల్ దాడులు
టెహ్రాన్, మార్చి 9: ఇరాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీసేలా అమెరికా, ఇజ్రాయెల్ దళాలు సోమవారం తెల్లవారుజామున భీకర దాడులు చేశాయి. టెహ్రాన్ పరిసరాల్లోని ఐదు కీలక చమురు నిల్వ కేంద్రాలే లక్ష్యంగా బాంబుల వర్షం కురిపించాయి. ఈ దాడుల వల్ల చమురు నిల్వలు పేలి అగ్నికీలలు ఎగసిపడ్డాయి. టెహ్రాన్ వీధులంతా ఎటుచూసినా మంటలు వ్యాపించాయి. ఆకాశంలో వందల మీటర్ల ఎత్తున నల్లని పొగలు కమ్ముకోవడంతో పట్టపగలే చీకటి కమ్మినట్లు భయానక వాతావరణం నెలకొంది.
చమురు డిపోలపై జరిగిన దాడుల్లో నలుగురు ట్యాంకర్ డ్రైవర్లు అక్కడికక్కడే మరణించారు. ఇరాన్ పై మున్ముందు మరిన్ని దాడులు ఉంటాయని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు హెచ్చరించిన కొద్ది గంటల్లోనే ఈ విధ్వంసం చోటుచేసుకుంది. టెహ్రాన్తో పాటు అల్బ్ రోజ్, యాజ్ద్, ఇస్ఫహాన్ ప్రాంతాల్లోనూ అమెరికన్ బలగాలు బాంబులు వేశాయి. అలాగే, ఖుద్స్ ఫోర్స్ ప్రధాన కార్యాలయాన్నీ ఇజ్రాయెల్ సైన్యం నేలమట్టం చేసింది. ఒక్క వారంలోనే 6,500 దాడులు చేసి ఇరాన్ గగనతలాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నామని ఇజ్రాయెల్ రక్షణ దళాలు ప్రకటించాయి. అమెరికా నుంచి ఇరాన్ కొనుగోలు చేసిన 7 ఎఫ్14 ఫైటర్ జెట్లను కూడా ఇస్ఫహాన్ ఎయిర్పోర్టులో ధ్వంసం చేశామని వెల్లడించాయి.




