బడ్జెట్లో బీసీలకు తీరని అన్యాయం
ఎన్నికల వాగ్దానం ప్రకారం బడ్జెట్ను రూ.20 వేల కోట్ల పెంచాలి
బీసీ కార్పొరేషన్, బీసీ కుల ఫెడరేషన్ల రూ. 10వేల కోట్లు కేటాయించాలి
జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య
ముషీరాబాద్, మార్చి 21 (విజయక్రాంతి): బడ్జెట్లో బీసీలకు తీరని అన్యా యం చేశారని తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్, ఎంపీ అర్.కృష్ణయ్య ద్వజమెత్తారు. రాష్ట్రంలో బీసీ ఉద్యమం బలంగా ఉన్న తరుణంలో ఇది బీసీల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనం అన్నారు. శనివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో బీసీ 14 సంఘాల అత్యవసర సమావేశం జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేష్ అధ్యక్షత జరిగింది.
ఈ సందర్బంగా ఎంపీ ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ బడ్జెట్ లో రూ.3 లక్షల 24 వేల కోట్లలో బీసీలకు కేవలం రూ.12,511 కోట్లు మాత్రమే కేటాయించి తీవ్ర అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వాగ్దానంతో పాటు కామారెడ్డి డెకరేషన్ లో ప్రతి యేటా రూ.20 వేల కోట్లు కేటాయిస్తామని ప్రకటించి, మూడు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి కూడా వాగ్దానం నెరవేర్చలేదని అన్నారు.
తక్షణమే బడ్జెట్ను సమీక్షించి ఎన్నికల వాగ్దా నం ప్రకారం బడ్జెట్ రూ.20 వేల కోట్లకు పెంచాలని అన్నారు. బీసీ కార్పోరేషన్, బీసీ కుల ఫెడరేషన్లకు రూ.10 వేల కోట్లు కేటాయించాలని అన్నారు. ఒక్కో బీసీ కుటుం బానికి రూ.20 లక్షలతో పాటు 80 శాతం సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలన్నారు. ప్రభుత్వం బీసీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో 14 బీసీ సంఘాల నాయకులు జిల్లపల్లి అంజి, అనంతయ్య, రాజేందర్, శివ కుమార్, ఆశిష్ గౌడ్, నిఖిల్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.




