30-12-2025 02:28:03 PM
రథయాత్రలో పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు
సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో మంగళవారం వైకుంఠ ఏకాదశి వేడుకలు అంగరంగా వైభవంగా జరిగాయి. ముక్కోటి ఏకాదశి నాడు మూడు కోట్ల దేవతలు నారాయణుని ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకుంటారని భక్తుల నమ్మకం భక్తులు కూడా తెల్లవారు జాము నుండే స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం నుండి తెల్లవారుజామున రథయాత్ర పూర వీధుల గుండా నిర్వహించారు.
రథయాత్ర లో భాగంగా పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని భక్తి పాటలతో చేసిన నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం చైర్మన్ వల్ల మురళీధర్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో ఆలయ పూజారి సౌమిత్రి శ్రావణ్ కుమార్ ప్రత్యేక పూజలు చేశారు... వేణుగోపాల స్వామి దేవాలయం ఆవరణలో గల శ్రీ సాంబశివ దేవాలయంలోనూ ఉత్తర ద్వారం ద్వారా స్వామి వారిని దర్శించుకున్నారు. పూజారి పారువెల్ల రమేష్ శర్మ ప్రత్యేక పూజలు చేశారు, అలాగే సుల్తానాబాద్ పట్టణంతోపాటు మండలంలోని పలు గ్రామాల్లో ను ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ పల్లా మురళీధర్, పెరికగిద్ద హనుమాన్ ఆలయ కమిటీ చైర్మన్ ఆకుల రామేశ్వర్ రెడ్డి, డైరెక్టర్ పోషమల్లు, పూజారి అభిలాష్, శివాలయం కమిటీ చైర్మన్ అల్లంకి సత్యనారాయణ, పూజారి వల్లకొండ మహేష్, వికాస తరంగిణి సభ్యులు సాదుల సుగుణాకర్, మున్సిపల్ కమిషనర్ రమేష్ తోపాటు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. సామాజిక సేవకులు పల్ల కిషన్ శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయంలో పాల్గొన్న భక్తులకు తేనేటి విందు ఏర్పాటు చేశారు.