calender_icon.png 8 June, 2025 | 6:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విజ్ఞాన్ యూనివర్సిటీ గుర్తింపు రద్దు చేయాలి

02-06-2025 12:14:41 AM

మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్

ముషీరాబాద్, జూన్ 1 (విజయక్రాంతి) : విద్యార్థులకు భద్రత లేని విజ్ఞాన్ యూనివర్సిటీ గుర్తింపు రద్దు చేసి, యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ డిమాండ్ చేశారు. కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా ఓ దళిత విద్యార్థి మృతి చెందారని, ఆ యాజమాన్యంపై ఎస్సి, ఎస్టీ కేసు నమోదు చేయాలని  డిమాండ్ చేశారు.

ఈ మేరకు ఆదివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్  లో మృతుడి తల్లిదండ్రులు భానుప్రతాప్, రజిని, సంఘం ప్రధాన కార్యదర్శి బైరి రమేష్ లతో కలిసి పిల్లి సుధాకర్ మాట్లాడారు. భూదాన్ పోచంపల్లి విజ్ఞాన్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్  ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న బొడ్డు శ్యామ్ చరణ్ ఈ ఏడాది ఏప్రిల్ 2న క్వారీ నీటిలో పడి మృతి చెందారని  తెలిపారు. కళాశాల యాజమాన్యం పర్యవేక్షణ లోపంతో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారని తెలిపారు.

ప్రమాదం జరిగిన స్థలంలో సీసీటీవీ కెమెరాలు లేకపోవడం, తల్లిదండ్రులు రాకముందే మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించడం పలు అనుమానాలకు తావిస్తుందన్నారు. స్థానిక పోలీస్ స్టేషన్ లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మృతుడి తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ కుమారుడు మెరిట్ స్టూడెంట్ అని, ఒక్కడే కొడుకు కావడంతో గారాబంగా చూసుకున్నామని కన్నీరు మున్నీరయ్యారు.

యాజమాన్యం వివరణ కోసం కళాశాల వద్దకు వెళ్తే కళాశాల సీఈవో బోయపాటి శ్రవణ్ కుమార్ అవమానకరమైన రీతిలో మాట్లాడారని ఆరోపించారు. ఆయనపై ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలన్నారు. తమ కుమారుడు క్వారీలో పడినప్పుడు అక్కడ ఉన్న మరో ముగ్గురు విద్యార్థులను విచారిస్తే వాస్తవాలు బయటకు వస్తాయన్నారు.

ప్రభుత్వం జోక్యం చేసుకొని, తమ కుమారుడి మృతికి కారకులపై చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు. ఈ సమావేశంలో  నాయకులు చిప్పల నర్సింగారావు, అల్లిబిల్లి మహేందర్, పరుశరామ్, చింతల మహేశ్వరి, ఇందిర ప్రియదర్శిని, బొడ్డు బుజ్జిబాబు, నాయకోటి రవికాంత్ పాల్గొన్నారు.