calender_icon.png 15 June, 2025 | 2:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యుద్ధ కావ్యం!

06-06-2025 12:00:00 AM

నేడు సుద్దాల హనుమంతు జయంతి :

‘పల్లెటూరి పిల్లగాడ పసుల కాసే మొనగాడ..’ ఈ పాట వినని వారుండరు. ముక్కు పచ్చలారని పిల్లలను పశువుల కాపరులుగా పెట్టుకుని వాళ్ళను ఎన్ని విధాలుగా మోసం చేసేవారో, ఎలా పీడించే వారో తన పాటలో కళ్ళకు కట్టినట్లు రాసిన కవి సుద్దాల. నిజాం కాలంలో తెలంగాణ ఊరూరు భూ స్వాముల కర్కశ కబంధహస్తాల్లో నలిగి పోతున్నప్పుడు కదనరంగాన దుమికిన యుద్ధకావ్యం సుద్దాల హనుమంతు.

అణచివేతలను ప్రతిఘటించేలా ప్రజలను పోరాటానికి ప్రోత్సహించిన కలం, గళం ఆయనది. కాలికి గజ్జె, భుజాన గొంగడి, పల్లెపల్లెలు పాటయి ప్రవహించిన యుద్ధగీతం. గొంతును తూటాగా, అక్షరాన్ని శతఘ్నిగా మలిచి ప్రజాశక్తులను ఉద్యమాల బాట పట్టించిన కంచుకంఠం. జానపద భాష, ప్రజల యాసలో బడుగు బతుకులకు దారి చూపిన నేస్తం సుద్దాల.

పాత నల్గొండ జిల్లా మోత్కూరు మండలం పాలడుగు గ్రామంలో 1910లో నిరుపేద చేనేత కుటుంబంలో జన్మించారు. హనుమంతు తండ్రి ఆయుర్వేద వైద్యం చేసేవారు. చిన్ననాటి నుంచి హనుమంతుకు హరికథలు, పాటలు, నాటకాలంటే చాలా ఇష్టం. శతకాలు, కీర్తనలు, సీస, కంద పద్యాలు కంఠస్థం చేశారు.

యక్షగానాలు, కీర్తనలు, భజనల్లాంటి కళారూపాలపట్ల ఎంతో ఆసక్తి ఉండేది. గొంతెత్తి పాడటం చాలా ఇష్టం. చిన్నతనం నుంచే నాటకాలపై ఆసక్తి మెండు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఆయనకు ఈ య క్షగానాలు, హరికథలు, బుర్రకథలే పోరాట ప్రచారానికి ఉపయోగపడ్డాయి. ఆయన బుర్రకథ బలహీనుడినీ యుద్ధయోధుడిగా నిలబెట్టేదంటారు. 

హైదరాబాద్ సంస్థానంలో భూస్వాముల దురాగతాలను, దొరల దౌర్జన్యాలను బుర్రకథల రూపంలో చాటి చెప్పేవారు. విచిత్రవేషాలు, గొల్లసుద్దులు, లత్కోరు సాబ్, బుడబుక్కలు, ఫకీరు, సాధువు తదితర కళారూపాల ద్వారా పీడిత వర్గాల బాధలను వ్యక్తం చేసేవారు. భువనగిరిలో రావి నారాయణరెడ్డి అధ్యక్షతన 1944లో జరిగిన ‘ఆంధ్ర మహాసభ’లో స్వచ్ఛంధ కార్యకర్తగా పాల్గొన్నారు.

గ్రామంలో ‘సంఘం’ స్థాపించి, పాటలు కట్టి ప్రజలను పోరాటోన్ముఖులను చేశారు. రావి నారాయణరెడ్డి ఆధ్వర్యంలో కమ్యూనిస్టు పార్టీలో సాంస్కృతిక విభాగం బాధ్యతలు స్వీకరించారు. ఎక్కడ మీటింగులు, పోరాటాలు జరిగినా అక్కడ తన కలం, గళం కలగలిపి ప్రజలను మేల్కొల్పేవారు. సంఘం పెట్టి, పాటలు కట్టి, ప్రజలను రెచ్చగొడుతున్నాడని నిజాం ప్రభుత్వం ఆయనకు అరెస్టు వారెంట్ జారీ చేసింది.

దాంతో హనుమంతు అజ్ఙాతవాసంలోకి వెళ్లారు. వెట్టిచాకిరీ, దొరల దౌర్జన్యాలను నిరసిస్తూ హనుమంతు రాసిన పాటలు వీర తెలంగాణ పేరుతో అచ్చయ్యాయి. నిజాం వ్యతిరేక పోరాటంలోనే కాదు, తెలంగాణ ప్రత్యేక పోరాటానికీ ఆయన జీవితం ఎంతో స్ఫూర్తిని ఇచ్చింది. 1948 హైదరాబాద్ పోలీసు యాక్షన్ తర్వాత కొద్దికాలం ఆయన బొంబాయిలో గడిపారు. సుదీర్ఘ కాలం ప్రజా పోరాటాల్లోనే వారి జీవితం గడిచింది.

గొంతు క్యాన్సర్‌తో తీవ్ర అనారోగ్యానికి గురైన సుద్దాల హనుమంతు 1982 అక్టోబర్ 10న కన్నుమూశారు. అప్పటికి ఆయన వయస్సు 74 సంవత్సరాలు. జీవితమంతా పీడిత ప్రజానీకం కోసం గొంతెత్తి పాడిన హనుమంతు జీవితం గురించి నేటి తరం తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. 

 డా. నామోజు