06-06-2025 12:00:00 AM
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫైనల్స్లో ఆర్సీబీ కప్ గెలిచిన ఆనందం 24 గంటలు గడువక ముందే ఆవిరైంది. బెంగ ళూరు చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ విజయోత్సవానికి తరలివచ్చిన అభిమానులకు విషాదం మిగిలింది. 18 సీజన్ల తర్వాత ఐపీఎల్ కప్ సాధించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు మంగళవారం రాత్రే క్రికెట్ అభిమానులు దేశమంతటా జేజేలు పలికారు.
సంబరాలు చేసుకున్నారు. బుధ వారం మధ్యాహ్నం బెంగళూరులో విజయోత్సాహం, చరిత్రలో మధుర క్ష ణాలుగా నిలవాల్సిన వేళ విషాదంగా మిగిలింది. చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాటలో 11 మంది చనిపోగా, అనేకమంది గాయపడ్డారు. 30 వేలతో నిండిపోయే స్టేడియంకు మూడు లక్షల మంది దాకా క్రికెట్ అభిమానులు తరలివచ్చారు. అది వారి తప్పు కాదు.
విజయోత్సవాన్ని నిర్వహించడంలో ఆర్సీబీ యాజమాన్యం, బెంగళూరు పోలీసుల మధ్య సమన్వయం లోపించింది. స్టేడియంలో విజయోత్సవానికి ముందు, విధానసౌధలో బెంగళూరు జట్టుకు.. (ఇందులో ఒక్క ఆటగాడు మినహా, కోచ్తోసహా ఆటగాళ్లెవరూ కర్ణాటకకు చెందిన వారు కాదు. ఐపీఎల్ జట్ల కూర్పే అలా ఉంటుంది మరి) ఘన సత్కారం జరుగుతున్నప్పుడే అక్కడికి దగ్గర్లోని చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాట జరుగుతున్నదని వార్తలు వచ్చాయి.
బెంగళూరు విధానసౌధ వద్ద అప్పటికే ఇసుక వేస్తే రాలనంత మంది క్రికెట్ అభిమానులు వున్నారు. ఆ తర్వాత లక్షలాది మంది పాస్లు ఉన్నవారు, లేనివారు స్టేడియం గేట్లవద్దకు చేరుకున్నారు. గేట్లు తోస్తున్న వారు కొందరైతే, గేట్లు ఎక్కి స్టేడియం లోపలికి వెళుతున్న వారు ఇంకొందరు. ఇంత గందరగోళ పరిస్థితి వున్నా నిర్దుష్టంగా క్రికెట్ అభిమానులకు దిశానిర్దేశం చేసేవారు కరువయ్యారు.
తమ ఆరాధ్య క్రికెటర్లను కనులారా చూసి, విజయోత్సవాన్ని తిలకించాలనే ఉత్సాహమే వాళ్ల ప్రాణాలమీదికి తెచ్చింది. ఉత్సవ నిర్వహణ లోపం పోలీసులదే అంటే, కాదు ఆర్సీబీదే అనే విధంగా వారి ప్రకటనలు వెలువడ్డాయి. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన బారికేడ్లు కనిపించకుండా పోయాయి. క్యూ పద్ధతి లేదు. స్టేడియం గేట్లు ఒక్కసారిగా తెరవడంతో ఒకరిపై ఒకరు పడి భయానకంగా తొక్కిసలాట జరిగింది.
బెంగళూరులో విజేత క్రికెట్ జట్టు విజయోత్సవ ర్యాలీ వుంటుందా, వుండదా అనే విషయంలోనూ అభిమానులకు సాయంత్రం వరకు స్పష్టత లేదు. ఉంటుందని కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (కేఎస్సీఏ) ప్రకటించింది. అవును, పెరేడ్ జరుగుతుందని ఆర్సీబీ యాజమాన్యమూ సోషల్ మీడియాలో ప్రచారం చేసింది. ‘హై రిస్క్’.. అది కుదరదని పోలీసులు దానిని కొట్టి పడేశారు.
నిర్లక్ష్యం ఇలా విజయోత్సవాన్ని విషాదం చేసింది. చనిపోయిన వారిలో యువకులే ఎక్కువ మంది కావడం గుండెలు అవిసేలా చేసింది. స్టేడియం వద్ద జరిగిన బీభత్సాన్ని చూస్తే, నాకు మాటలు రావటం లేదని విరాట్ కోహ్లీ బాధాతప్త హృదయంతో చెప్పారు. ప్రాణాలకు మన దేశంలో పెద్దగా విలువ వుండదు.
ఒక్క ఏడాదిలో.. తిరుపతిలో భక్తులు తొక్కిసలాటలో మరణించినా, కుంభమేళాలో తొక్కిసలాట జరిగినా, కుంభమేళాకు వెళ్లేవారు ఢిల్లీ రైల్వేస్టేషన్లో తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయినా, హత్రాస్ ఘటన అయినా, ఆఖరికి హైదరాబాద్ సినిమాకని థియేటర్కు వెళ్లినా.. జనం ప్రాణాలపై నిర్లక్ష్యం నీడ పడుతూనే ఉంటుంది. జనం పెద్దసంఖ్యలో ఒకచోట కూడినప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలో అధికార యంత్రాంగానికి పెద్దగా పట్టదు.