22-10-2025 04:26:07 PM
వరంగల్,(విజయక్రాంతి): వరంగల్ ఆర్టీఏ అధికారులను ఏసీబీ పేరుతో సైబర్ నేరస్తులు బురిడీ కొట్టించారు. కేసులను మాఫీ చేస్తామని పేరుతో రూ.10 లక్షల20వేలకు పైగా కాజేసినట్లు తెలిసింది. ఈ క్రమంలో నాలుగు రోజుల కిందట వరంగల్ ఆర్టీఏ అధికా రులకు గుర్తు తెలియని వ్యక్తులు 98868 26656, 98804 72272, 95919 38585 నెంబర్ నుంచి ఫోన్ చేసి ఆర్టీఏ కార్యాలయంలో జరుగుతున్న అవినీతి అంతా తెలుసని, అరెస్టు కాకుండా ఉండాలంటే డబ్బులు పంపించాలని ఎంవీఐలను బెదిరించగా దశల వారీగా రూ.10లక్షల 20 వేలను గుర్తు తెలియని వ్యక్తుల అకౌంట్లోకి జమ చేశారు. ఫోన్ మాట్లాడుతున్న ఓ అధికారికి అనుమానం రావడంతో ఏసీబీతో పాటు పోలీసులను ఆశ్రయించారు.
వారు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం వరంగల్ ఆర్టీఏ కార్యాలయంలో కొన్ని రోజుల క్రితం ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. ఆ తర్వాత కొందరు సైబర్ నేరస్తులు కార్యాలయంకు ఫోన్ చేశారు. ఆర్టీఏ జిల్లా అధికారిని లైన్ లోకి తీసుకొని కేసు విషయంపై బెదిరింపులు చేశారు. ఆయనను లైన్లో పెట్టి మరో అధికారితో మాట్లాడారు. కేసులు మాఫీ కావాలంటే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. డిజిటల్ అరెస్టు పేరు మీద వారిని లైన్లోనే ఉంచి మాట్లాడారు.
విడతల వారీగా వారి నుంచి డబ్బులను వసూలు చేశారు. సుమారుగా రూ.10లక్షల 20వేలకు పైగా డబ్బులు వేయించుకొని వదిలిపెట్టారు. వారు మాట్లాడే విధానంలో అనుమానం వచ్చిన ఆర్టీఏ అధికారులు తర్వాత ఏసీబీ అధికారులతో మాట్లాడారు. తాము మోసపోయామని గుర్తించారు. వెంటనే ఏసీబీ అధికారుల సూచన మేరకు వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అధికారులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఫోన్ కాల్, బ్యాంక్ అకౌంట్ల వివరాల ప్రకారం కర్ణాటకలోని బీదర్ ప్రాంతం నుంచి సైబర్ నేరస్తులు ఈ నేరానికి పాల్పడినట్లు గుర్తించారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ విషయం సంచలనం సృష్టించగా ఏసీబీ అధికారులు ఎవరూ నేరుగా అధికారులతో మాట్లాడరని అటువంటి కాల్స్ వస్తే తమ దృష్టికి తీసుకురావడంతో పాటు సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపారు. సైబర్ నేరస్థుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.