లక్షెట్టిపేటలో పెట్రోల్లో నీళ్లు
ఇబ్బందులు పడ్డ వాహనదారులు
యాజమానిని నిలదీసిన ప్రజలు
లక్షెట్టిపేట(మంచిర్యాల), జూన్ 27 (విజయక్రాంతి): లక్షెట్టిపేటలోని హెచ్పీ పెట్రోలు బంక్ ట్యాంకర్లో ఇటీవల కురిసిన వర్షానికి నీరు చేరింది. ఇది గమనించకుండా బంక్ నిర్వాహకులు వాహనదారులకు పెట్రోలు పోయడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మిషన్ కాంపోండ్లో నివాసముండే జయ ప్రభాకర్ తన స్యూటీలో గురువారం ఉదయం 8 గంటలకు రూ.200 పెట్రోల్ పోయించగా వాహనం కొంత దూరం వెళ్లి నిలిచిపోయింది. మెకానిక్ దగ్గరుకు తీసుకెళ్లగా పెట్రోల్లో నీరు కలువడంతో వాహనం ఆగిపోయిందని చెప్పాడు. వెంటనే బంక్ వద్దకు వచ్చి సిబ్బందిని నిలదీశాడు. అప్పటికే తనలా ఇబ్బందిపడ్డ కస్టమర్లు బంకు వద్ద క్యూ కట్టారు. బంక్ యజమాని వాహనదారులనే బెదిరించే ప్రయత్నం చేయగా.. తహశీల్దార్ రాఘవేంద్రరావుకు ఫిర్యాదు చేశారు. స్పందించిన తహశీల్దార్ పెట్రోల్ షాంపిల్స్ పరీక్షించి చర్యలు తీసుకుంటామని చెప్పడంతో బాధితులు శాంతించారు.




