13-12-2025 01:26:27 AM
నరేశ్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా ‘గుర్రం పాపిరెడ్డి’. ఈ చిత్రాన్ని వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ నిర్మిస్తున్నారు. డార్క్ కామెడీ కథతో ఇప్పటివరకు మనం తెరపై చూడని కాన్సెప్ట్తో దర్శకుడు మురళీమనోహర్ రూపొందిస్తున్నారు. ఈ నెల 19న థియేట్రికల్ రిలీజ్కు రాబోతున్న ఈ సినిమా విశేషాలను ప్రొడ్యూసర్స్ విలేకరులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా జయకాంత్ మాట్లాడుతూ.. “-డైరెక్టర్ మురళీమనోహర్ ‘గుర్రం పాపిరెడ్డి’ స్టోరీ మాకు నెరేట్ చేశాడు. కథ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ప్రొడక్షన్ స్టార్ట్ చేసేటప్పుడు కొత్త ప్రొడ్యూసర్స్ ఏదైనా లవ్స్టోరీతో, యూత్ ఫుల్ కంటెంట్తో చేస్తుంటారు.
కానీ మేం రొటీన్ ప్రాజెక్ట్ చేయొద్దనే డార్క్ కామెడీ జానర్లో ఈ సినిమాను నిర్మించాం. ఈ కథను కొందరు హీరోలకు చెప్పాం. కానీ, వారికి వేరే ప్రాజెక్టులు ఉండటం వల్ల కుదరలేదు. నరేశ్ అగస్త్యను కలిసిన తర్వాత మా డైరెక్టర్కు కూడా ఈ కథకు ఆయనే యాప్ట్ అని చెప్పాడు. ఫరియా అబ్దుల్లా జాతిరత్నాలు సినిమా పాత్రతో చూస్తే మా మూవీలో ఆమె చేసిన సౌధామిని క్యారెక్టర్ కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది” అన్నారు.
అమర్ బురా మాట్లాడుతూ.. “తెలివిలేని వాళ్లు తెలివైనవాడిని ఎలా ఎదుర్కొన్నారనేది మా మూవీ పాయింట్. ఫన్, కామెడీతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. సందేశాలు వినేందుకు ప్రేక్షకులు థియేటర్స్ కు రారు. వాళ్లకు ఆ కాసేపు వినోదం పంచాలి. ‘మ్యాడ్’, ‘మ్యాడ్2’ పాత్రలను చూస్తేనే ఎలా నవ్వుకున్నామో.. మా సినిమాలోనూ ఆర్టిస్టులను చూడగానే ఫన్గా ఫీలవు తారు.
సినిమా బిజినెస్ చేయడం మామూలు విషయం కాదు. మా మూవీ కంటెంట్ ప్రతి ఒక్కరికీ నచ్చినా.. స్టార్ హీరో లేక బిజినెస్ పరంగా ఇబ్బంది అయ్యింది. అయితే, కంటెంట్ను నమ్మి ‘గుర్రం పాపిరెడ్డి’ని 140 స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నాం. ముందే పెద్ద సంఖ్యలో థియేటర్స్ వేసి సినిమాకు జనం లేరనిపించుకోవడం కంటే స్పందన బాగుంటే పెంచుకోవచ్చని అనుకున్నాం” అని చెప్పారు.