5 June, 2026 | 1:11 AM

పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలి

05-06-2026 12:00 AM

పెద్దపల్లి అటవీ రేంజ్ అధికారి సతీష్ కుమార్

మంథని, జూన్ 4 (విజయక్రాంతి): ప్రజాపాలనప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఇంచార్జీ జిల్లా అటవీ అధికారి ఎం.నవీన్ రెడ్డి, ఐఎఫ్‌ఎస్ ఆదేశాల మేరకు మంథని రేంజ్ పరిధిలోని జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో పర్యావరణ పరిరక్షణలో అడవుల ప్రాధాన్యంపై అవగాహన కార్యక్రమం, వ్యాసరచన పోటీలు నిర్వహించినట్లు పెద్దపల్లి అటవీ రేంజ్ అధికారి టి. సతీష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ... అడవులు పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయని, జీవవైవిధ్య పరిరక్షణకు అటవీ సంపద ఎంతో అవసరమని అన్నారు. 

కానీ విద్యార్థులు చిన్న వయస్సు నుంచే ప్రకృతి పరిరక్షణ పట్ల బాధ్యతాయుతమైన దృక్పథాన్ని పెంపొందించుకోవాలని, ప్రతి ఒక్కరూ.. మొక్కలు నాటి వాటి సంరక్షణకు కృషి చేయాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన కార్యక్రమాలను జిల్లావ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రేంజ్ అధికారి జి. కొమురయ్య, స్ట్రైక్ ఫోర్స్ ఎఫ్‌ఎస్వో ఎస్ డి, రహీమతుల్లా, ఫారెస్ట్ బీట్ అధికారులు డి. శ్రావంతి, ప్రదీప్, సహాయ శాస్త్రవేత్త పి. కనకజ్యోతి, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి డి. కల్పన, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ కె. రమేష్, ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ డి.శంకర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, అటవీ శాఖ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.