స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి
కాంగ్రెస్ వ్యవహారల రాష్ట్ర ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్
హైదరాబాద్, ఏప్రిల్ 17 (విజయక్రాంతి): పాత, కొత్త నాయకులు, కార్యకర్తలు ఐకమత్యంతో పని చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయానికి దోహదపడాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ పిలుపునిచ్చారు. గురువారం గాంధీభవన్లో పీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్గౌడ్ అధ్యక్షతన సికింద్రాబాద్, నిజామాబాద్, హైదరాబాద్ పార్లమెంట్ నియోజక వర్గాలకు సంబంధించి సమీక్షా సమావేశం నిర్వహించారు.
మీనాక్షినటరాజన్ మాట్లాడుతూ.. పార్టీ కార్యకర్తలు, ప్రజల సమస్యలను వినేందుకు గతంలో గాంధీభవన్కు మంత్రులు వచ్చినట్లుగానే.. భవిష్యత్లో మంత్రులు గాంధీభవన్కు రావాలని సూచించారు. పేద ప్రజల కోసం రాహుల్గాంధీ చేస్తున్న ప్రయత్నానికి ప్రతి కార్యకర్త అండగా ఉండాలని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ది పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు.
పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతురావు మాట్లాడుతూ.. పార్టీలో కొత్తగా వచ్చిన నాయకులతో పాత నాయకుల మధ్య సమన్వయం చేసి ముందుకు తీసుకెళ్లాలని సూచించా రు. ప్రభుత్వం సన్నబియ్యం పథకం, రాజీవ్ యువ వికాస్తో పాటు అనేక పథకాలను తీసుకొచ్చిందని, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలదేనన్నారు.
కాగా శుక్రవారం ఉదయం 11 గంటలకు చేవెళ్ల, మధ్యాహ్నం 12:30 గంటలకు జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్షలు ఉంటాయని పార్టీ వర్గాలు తెలిపాయి. మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ అంజన్కుమార్ యాదవ్, విశ్వనాథ్ పాల్గొన్నారు.




