12-06-2025 12:38:14 AM
కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల
మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ, ఆర్థిక సలహాదారు సంజీత్
ఖమ్మం, జూన్ 11(విజయ క్రాంతి): చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించేందుకు సమన్వయంతో పని చేయాలని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ, ఆర్థిక సలహాదారు సంజీత్ అన్నారు.బుధవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ, ఆర్థిక సలహాదారు, జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ లతో కలిసి ప్రధానమంత్రి కృషి సంచయి యోజన (పీ.ఎం.కే.ఎస్.వై), జల్ జీవన్ మిషన్ (జె.జె.ఎం) ప్రాజెక్టులపై ఇరిగేషన్, మిషన్ భగీరథ, సంబంధిత జిల్లా అధికారులతో సమీక్షించారు.
ఖమ్మం జిల్లాలో పీ.ఎం.కే.ఎస్.వై. క్రింద చేపట్టిన వివిధ ప్రాజెక్టు పనుల పురోగతి వివరాలు, మిషన్ భగీరథ, జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టు వివరాలను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించే విధంగా ప్రాజెక్టుల పెండింగ్ పనులను పూర్తి చేసేందుకు అవసరమైన సహాయ, సహకారాలు అందించాలనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందని అన్నారు.
అనంతరం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో 7 లక్షల 70 వేల ఎకరాల వ్యవసాయ భూమికి గాను, 4.5 లక్షల ఎకరాలకు నీటిపారుదల వ్యవస్థ క్రింద ఆయకట్టు ఉందని అన్నారు. సన్న రకం వడ్ల సాగుకు ప్రభుత్వం బోనస్ ఇస్తున్న నేపథ్యంలో వరి పంట విస్తీర్ణం పెరుగుతున్నదని అన్నారు.
ఈ సమావేశంలో సి.జి.డబ్ల్యూ.బి. టెక్నికల్ అధికారి టి. మాధవ్, సి.డబ్ల్యు.సి. టెక్నికల్ అధికారి రూపేష్, ఇరిగేషన్ శాఖ చీఫ్ ఇంజనీర్ డి.వి. రమేష్ బాబు, సూపరింటెండింగ్ ఇంజనీర్ ఎన్. శివధర్మ తేజ, మిషన్ భగీరథ ఎస్.ఈ. శేఖర్ రెడ్డి, జెడ్పీ సి.ఈ.ఓ. దీక్షా రైనా, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి సన్యాసయ్య, జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత, జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య, నీటి పారుదల శాఖ ఇంజనీర్లు, మిషన్ భగీరథ, వ్యవసాయ శాఖ అధికారులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.