21-06-2025 12:00:00 AM
రాష్ట్ర పశు సంవర్ధక, పాడి పరిశ్రమలు, మత్స్య శాఖ
మరియు క్రీడా యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి
వనపర్తి, జూన్ 20 ( విజయక్రాంతి ) : వనపర్తి జిల్లాలోని మక్తల్ నియోజక వర్గంలోని ఆత్మకూరు, అమరచింత ప్రాంతాల అభివృద్ధికి సహకరించాలని రాష్ట్ర పశు సంవర్ధక, పాడి పరిశ్రమలు, మత్స్య శాఖ మరియు క్రీడా యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ను సూచించారు.
వాకిటి శ్రీహరి రాష్ట్రంలో మంత్రి పదవి స్వీకారం చేసిన అనంతరం శుక్రవారం తొలిసారిగా మక్తల్ నియోజకవర్గంలోని ఆత్మకూరు, అమరచింత మున్సిపాలిటీలలో పర్యటించారు. జిల్లాకు మొదటిసారి విచ్చేసిన రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి కి జిల్లా కలెక్టర్ పుష్ప గుచ్చాలతో స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆత్మకూరు, అమరచింత ప్రాంతంలో విద్యా, వైద్య రంగానికి అభివృద్ధి చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను సూచించారు. అనంతరం అమరచింత జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కల్యాణలక్ష్మి, శాదిముబారక్, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి తన చేతుల మీదుగా లబ్ధిదారులకు చెక్కులు, పత్రాలు అందజేశారు.