దూళ్ళగుట్టను అభివృద్ధి చేస్తాం
కోదాడ, డిసెంబర్ 29: కోదాడ మండల పరిధిలోని యర్రవరం గ్రామంలో వెలసిన ప్రసిద్ధ దూళ్ళగుట్ట లక్ష్మీనరసింహస్వామి గుట్టను సమగ్రంగా అభివృద్ధి చేసి రాష్ట్ర స్థాయి పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దేందుకు అన్ని విధాల కృషి చేస్తామని గ్రామ సర్పంచ్ రావుల భవాని వెంకటేశ్వర్లు, ముదిరాజ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు భాషబోయిన భాస్కర్ రావు అన్నారు. సోమవారం యర్రవరం గ్రామంలోని శ్రీ బాల ఉగ్ర లక్ష్మీనరసింహస్వామి దేవాలయ ఆవరణలో నిర్వహించిన సన్మాన సభ కార్యక్రమంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు.
దేవాలయంలో పనిచేసే కార్మికుల జీతభత్యాల సమస్య కూడా పరిష్కరిస్తామన్నారు. భక్తుల రాకతో స్థానిక యువతకు ఉపాధి కల్పనకు అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు. గ్రామ ప్రజలు, భక్తులు అందరూ సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు.ముందుగా పాలకవర్గాన్ని ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సయ్యద్ శాలిని మస్తాన్, ఆలయ గౌరవ సభ్యులు బ్రహ్మయ్య, వార్డు సభ్యులు ఎం శ్రీను, పి శ్రీహరి, భవాని, నరసింహారావు, నెట్టెం నాగేంద్ర, గ్రామ నాయకులు, భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.






