వర్సిటీల్లోని ఖాళీలు భర్తీ చేయండి!
విద్యారంగానికి బడ్జెట్లో 10 శాతం నిధులు కేటాయించాలి
ప్రభుత్వానికి యూనివర్సిటీల వీసీల వినతి
హైదరాబాద్, డిసెంబర్ 29 (విజయక్రాంతి): రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయాలని యూనివర్సిటీల వీసీలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బ్యాక్లాగ్ పోస్టుల భర్తీపై స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలని వారు కోరారు. సోమవారం గచ్చిబౌలిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హా స్పిటాలిటీ మేనేజ్మెంట్ (నిథమ్)లో తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి బాలకిష్టారెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 12 వర్సిటీల వీసీల సమావేశాన్ని నిర్వహించారు.
వర్సిటీల్లో ఖాళీలు, కొత్త సిలబస్, ఉన్నత విద్యలో తీసుకురావాల్సిన మార్పులపై వీసీలు చర్చించి ప్రభుత్వానికి పలు ప్రతి పాదనలు చేశారు. ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయడానికి అనుమతులివ్వాలని, యూనివర్సిటీ చట్టాలు, ఆర్డినెన్స్లను సమీక్షించడానికి, కామన్ కరిక్యులమ్, అడ్మిషన్ల కోసం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలని, విద్యారంగానికి రాష్ట్ర బడ్జెట్లో 10 శాతం నిధులు కేటాయించాలని, ఆ దిశగా ఉన్నత విద్యామండలి ప్రభుత్వానికి ప్రతిపాదిస్తూ నివేదికివ్వాలని వీసీలు కోరారు.
ప్రతి యూ నివర్సిటీ అకాడమిక్ అడిట్ నివేదికను ఉన్నత విద్యామండలికి నివేదించాలని మం డలి చైర్మన్ బాలకిష్టారెడ్డి సూచించారు. జీరో లేదా 25 శాతం కంటే తక్కువ అడ్మిషన్లు ఉన్న విద్యాసంస్థలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ అకడమిక్ అడిట్ నిర్వహించి నివేదిక సమర్పించాలని నిర్ణయించారు. వచ్చే విద్యాసంవ త్సరం యూజీ 3 నుంచి 6 సెమిస్టర్ల సిలబస్లో నాణ్యత, ఉపాధి అవకాశాలు లభించే లా మార్పులు చేయాలని నిర్ణయించారు.
కాగా, ఆయా వర్సిటీ వీసీల ప్రతిపాదనలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఉన్నత విద్యామండలి తెలిపింది. సమావేశంలో ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్లు ఇ పురుషోత్తం, ఎస్కే మహమూద్, సెక్రటరీ ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేశ్, వర్సిటీల వీసీలు పాల్గొన్నారు.






