04-12-2025 12:25:05 AM
గద్వాల జిల్లా రాజశ్రీగార్లపాడులో సర్పంచ్ అభ్యర్థులకు బెదిరింపులు
కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు
అలంపూర్, డిసెంబర్ 3 : గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం రాజశ్రీగార్లపాడు గ్రామంలో పంచాయతీ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్న తమను నామినేషన్ వేస్తే చంపేస్తామని కొందరు బెదిరిస్తున్నారని గ్రామానికి చెందిన అల్లా బకాస్, హుస్సేన్ ఆరోపించారు. ప్రజాస్వామబద్ధంగా గ్రామంలో ఎన్నికలు నిర్వహించేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్, ఎస్పీకి బుధవారం ఫిర్యాదు చేశారు.
కలెక్టర్ బిఎం సంతోష్ను కలసి వారు ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు. గ్రామంలో కొందరు నాయకుల అండతో, డబ్బుల ద్వారా వేలంపాటను నిర్వహించి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేందుకు యత్నిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా కిడ్నాప్ చేస్తామని కుటుంబ సభ్యులను బెదిరిస్తున్నట్లు తెలిపారు. గ్రామంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని అలాగే నామినేషన్ వేసే అభ్యర్థులకు రక్షణ కల్పించాలని కలెక్టర్ను కోరారు.