calender_icon.png 4 June, 2025 | 4:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సహకరిస్తాం

31-05-2025 12:00:00 AM

-ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి 

-కలెక్టర్ తో కలిసి సామూహిక ఇళ్ల నిర్మాణాలకు భూమి పూజ 

నిజామాబాద్, మే 30 : (విజయక్రాంతి): నిరుపేద కుటుంబాల సొంతింటి కలను సాకారం చేయాలనే బృహత్తర సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు చేస్తోందని ప్రభుత్వ  సలహాదారు, బాన్సువాడ శాసన సభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

ఈ పథకం ద్వారా ఇంటి నిర్మాణానికి ముందుకు వచ్చే లబ్దిదారులకు ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తామని భరోసా కల్పించారు. నిజామాబాద్ జిల్లా బాన్సువాడ శాసన సభ నియోజకవర్గంలోని పోతంగల్ మండలం హంగర్గఫారంలో 40 మంది లబ్దిదారులకు మంజూరు అయిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు శుక్రవారం ఆయన సామూహిక భూమి పూజ చేశారు.

కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో తదితరులతో కలిసి పోచారం ఈ కార్యక్రమనికి హాజరయ్యారు. .కోటగిరి, పోతంగల్ మండలాలకు చెందిన 510 మంది లబ్దిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరీ పత్రాలు (ప్రొసీడింగ్స్) అందజేశారు.

అంతకుముందు కోటగిరి మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా నిర్మించిన మోడల్ ఇంటిని సందర్శించి లాంఛనంగా ప్రారంభించారు. 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ. 5 లక్షల లోపు వ్యయంతో ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసిన ఇంటి నిర్మాణ ఖర్చు, పనుల వివరాల గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈ నిధులను లబ్ధిదారులు ఒక్క నయాపైసా కూడా తిరిగి కట్టాల్సిన అవసరం లేదని సూచించారు. ఇళ్ల మంజూరీ కోసం ఎవరికీ ముడుపులు ఇవ్వకూడదని, అధికారుల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా అర్హులైన పేదలను గుర్తించి దశల వారీగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నామని పోచారం తెలిపారు. కుల మతాలు, రాజకీయాలకు అతీతంగా అర్హత ప్రాతిపదికన లబ్దిదారుల ఎంపిక జరుగుతుందని స్పష్టం చేశారు.

పొరుగున ఉన్న మహారాష్ట్ర లో అక్కడి ప్రభుత్వం ఒక్కో ఇంటి నిర్మాణానికి కేవలం లక్షా 25.వేల రూపాయలను మాత్రమే ఇస్తోందని, భారత దేశంలోనే మరెక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తోందని అన్నారు.

కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ, తొలి విడతలో ప్రభుత్వం నివేశన స్థలాలు కలిగి ఉన్న వారికి ఇందిరమ్మ ఇళ్ళను మంజూరు చేస్తోందని తెలిపారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో మొదటి విడతగా 3500 చొప్పున మంజూరు చేయడం జరిగిందని అన్నారు. లబ్ధిదారులు చేపట్టే ఇంటి నిర్మాణ దశలను అనుసరిస్తూ నాలుగు విడతలలో రూ. ఐదు లక్షలను వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తుందని సూచించారు.

బేస్మెంట్ లెవెల్ వరకు నిర్మాణం పూర్తి అయిన వెంటనే ఒక లక్ష రూపాయలు, రూఫ్ లెవెల్ కు మరో లక్ష రూపాయలు ఖాతాలో జమ చేస్తుందని అన్నారు. రూఫ్ వేశాక రెండు లక్షల రూపాయలను, నిర్మాణం పూర్తయ్యాక మిగతా లక్ష రూపాయలు ఖాతాలో జమ చేస్తుందని సూచించారు. మంజూరీలు అందుకున్న లబ్దిదారులు ఎలాంటి అపోహలకు లోను కాకుండా తక్షణమే నిర్మాణ పనులు ప్రారంభించాలని హితవు పలికారు.

ఈ పథకానికి నిధుల కొరత లేదని, పైలెట్ గ్రామాలలో రూఫ్ లెవెల్, లెంటల్ లెవెల్ వరకు నిర్మాణాలు పూర్తి చేసుకున్న 355 మందికి ఇప్పటికే వారి ఖాతాలలో డబ్బులు జమ చేశామని కలెక్టర్ తెలిపారు. అధికారులు ఇళ్ల నిర్మాణాలు నిరంతరం పర్యవేక్షిస్తూ, ప్రతీ సోమవారం నిర్మాణ దశలను బట్టి లబ్దిదారుల ఖాతాలలో డబ్బులు జమ చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమాలలో అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, లబ్దిదారులు పాల్గొన్నారు.