09-10-2025 09:36:12 PM
మా వాటా మాకు దక్కాల్సిందే..
ఈడబ్ల్యూఎస్ సక్రమమైనప్పుడు మా 42% అక్రమం ఏలా ఐతది..?
టీవివి జిల్లా అధ్యక్షులు సైదులు..
నల్గొండ: రాష్ట్రంలో మేమెంతమందిమో... మాకు అంత వాటా ఇవ్వాలి... జనాభా దామాషా ప్రాతిపదికన ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని ఈ దేశంలో వచ్చిన ఉద్యమాల ఫలితంగా 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చిందని తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు పందుల సైదులు, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు అయితగోని జనార్దన్ గౌడ్ అన్నారు. గురువారం పట్టణంలోని పూలే విగ్రహం ముందు 42% రిజర్వేషన్ పట్ల ఆదిఫత్య శక్తుల కుట్రలు నిరసిస్తూ బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రాష్ట్రం లోపల బీసీలు చేసినటువంటి ఉద్యమాల ఫలితంగా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో 42 శాతం రిజర్వేషన్ పై రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపి గవర్నర్ వద్దకు పంపడం జరిగింది అన్నారు. కానీ ఆదిపత్య శక్తులు అడుగడుగునా రిజర్వేషన్ల పెంపును అడ్డుకుంటున్నారని ఆన్నారు.
ఈ దేశంలో, రాష్ట్రంలో 60 శాతానికి పైబడి ఉన్న బీసీలు 42 శాతానికి అంగీకరించినప్పటికీ కూడా మా ఫలాలను అడ్డుకోవడం ఆధిపత్య శక్తుల కుట్రలే అన్నారు. న్యాయబద్ధంగా మాకు దక్కాల్సిన వాటా కోసం మాత్రమే పోరాడుతున్నామన్నారు. ఇందిరా సహని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 50 శాతం పరిమితి దాటోద్దని ఉందని పదేపదే న్యాయ వ్యవస్థ ముందు ఉంచుతున్నారని, ఇదే ఆదిపత్య శక్తులు ఇదే బీజేపీ ప్రభుత్వం ఆధిపత్య వర్గాలకు అనుకూలంగా 2022లో 103వ రాజ్యాంగ సవరణ చేసి 50 శాతం పరిమితిని ఉల్లంఘించి ఈడబ్ల్యూఎస్ పేరుతో 10 శాతం రిజర్వేషన్లు పొందారని ఇది రాజ్యాంగ ఉల్లంఘన కాదా? అని ప్రశ్నించ్చారు. భారత రాజ్యాంగంలోనూ చట్టంలోను ఎక్కడ కూడా 50% రిజర్వేషన్ల పరిమితి దాటోద్దని పేర్కొనలేదన్నారు. 2022లో జనహిత్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఈడబ్ల్యూఎస్ కోటాలో 10 % పెంచడం రాజ్యాంగ ఉల్లంఘన అవుతుందని పిటీషన్ తరఫున సుప్రీంకోర్టులో వాదనలు వినిపించినప్పుడు ఆనాటి బీజేపీ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తూ 50 శాతం పరిమితి అనేది సాధారణ నియమం మాత్రమే కానీ చట్టంలో ఎక్కడ పేర్కొనబడలేదని చెప్పారు.
చండ్రచూడు ధర్మాసనం రిజర్వేషన్ల విషయంలో తీర్పునిస్తూ 50 శాతం రిజర్వేషన్ అనేది సాధారణ నియమం మాత్రమే కానీ దాన్ని కఠినంగా అమలు చేయాల్సిన అవసరం లేదని నొక్కి చెప్పిందన్నారు. నేడు ఈ దేశంలో 5 శాతం లేని ఆధిపత్య శక్తులు 10 శాతం ఫలాలు అనుభవిస్తున్నప్పుడు 70 శాతం ఉన్న బహుజన వర్గాలం 42% అనుభవించడంలో ఎట్లా అన్యాయమైతుందన్నారు. తమిళనాడు రాష్ట్రంలో బీసీలకు 69 శాతం రిజర్వేషన్లు కల్పించబడుతున్నప్పుడు తెలంగాణలో ఎందుకు అతీతం అన్నారు. మా జనాభా ధామాషా ప్రాతిపదికన మా వాటా మాకు అందకుండా ఆధిపత్య శక్తులు కుట్రలు చేస్తున్నారని రాబోయే కాలంలో తగిన బుద్ధి చెబుతామన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది జోగు నగేష్ ముదిరాజ్, బీసీ రాజ్యాధికార సమితి నల్గొండ జిల్లా అధ్యక్షులు కర్నాటి యాదగిరి, వర్కింగ్ ప్రెసిడెంట్ మార్గం సతీష్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు గడగోజు విజయకుమార్, పట్టణ అధ్యక్షులు చిన్నోజు రాజు, బీసీ విద్యార్థి సంఘం జిల్లా నాయకులు కన్నబోయిన రాజు యాదవ్, పొగాకు రవికుమార్ యాదవ్, శ్రీకాంత్, తరుణ్ యాదవ్, మహేష్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.