బీసీల డిక్లరేషన్ ఎటుపాయె?
బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణతార
కామారెడ్డి, డిసెంబర్ 2 (విజయక్రాంతి): అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన కామారెడ్డి బీసీ డిక్లరేషన్ హామీ ఏమైందని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణతార ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సర్కారు తీరు 6 అబద్ధాలు, 66 మోసాలు అన్న చందంగా తయారైందని ఆమె విమర్శించారు. జిల్లాకేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.
ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రైతు భరోసా సరిగా రాలేదని.. యాసంగిలో కౌలురైతులకు భరోసా ఎప్పుడు ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళలకు ఇస్తానన్న రూ.2,500, విద్యార్థినులకు స్కూటీలు, కల్యాణలక్ష్మి పథకం కింద తులం బంగారం ఏమైందని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం ఏర్పాటయ్యాక కొత్తగా పింఛన్, రేషన్కార్డుల మంజూరు చేయలేదని దుయ్యబట్టారు.
నాలుగువేల నిరుద్యోగ భృతి ఏమైందని ప్రశ్నించారు. ప్రస్తుతం తెలంగాణ ప్రజల పరిస్థితి పెనంపై నుంచి పోయ్యిలో పడ్డట్టు అయ్యిందన్నారు. బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు జిల్లా కార్యాలయంలో ప్రభుత్వంపై శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే కాటెపల్లి వెంకటరమణారెడ్డి, సీనియర్ నాయకుడు మురళీధర్గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాణాల లక్ష్మారెడ్డి, నీలం చిన్నరాజులు, రంజిత్మోహన్, జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్రెడ్డి, రవీందర్రావు, నాయకులు శ్రీకాంత్, శ్రీనివాస్, లింగారావు, వేణు తదితరులు పాల్గొన్నారు.






