calender_icon.png 24 June, 2025 | 11:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పదవుల్లో చోటేది?

24-06-2025 01:52:43 AM

  1. గాంధీభవన్‌లోకి గొర్రెలమందతో వచ్చి యాదవ, కురుమల నిరసన 
  2. మంత్రివర్గం, పార్టీ, ప్రభుత్వ పదవుల్లో అవకాశం ఇవ్వాలని డిమాండ్
  3. భర్తీ చేయబోయే పదవుల్లో న్యాయం చేస్తామని పీసీసీ చీఫ్ హామీ

హైదరాబాద్, జూన్ 23 (విజయక్రాంతి): తెలంగాణ మంత్రివర్గం, పీసీసీ కార్యవర్గంతో పాటు నామినేటెడ్ పదవుల్లో యాదవ, కురుమ సామాజికవర్గాలకు చోటు కల్పించాలని కోరుతూ గొర్రెల కాపరుల సంక్షేమ సంఘం వినూత్నంగా నిరసన తెలిపింది. సోమవారం గొర్రెల కాపరులు లారీలో గొ ర్రెలు, మేకలతో గాంధీభవన్ వద్దకు చేరుకు ని ఆందోళన చేపట్టారు. గొర్రెల కాపరుల  సంక్షేమ సంఘం నాయకుడు శ్రీహరియాదవ్ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.

అప్రమత్తమైన పోలీసులు వారిని వారించే ప్రయత్నం చేయగా, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ను కలిసే వరకు నిరసన కొనసాగుతుందని యాదవ, కురు మ సంఘం నేతలు తేల్చిచెప్పారు. దీంతో పోలీసులు, నిరసనకారుల మధ్య కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొన్నది. రాష్ట్రంలో 40 లక్షలకు పైగా ఉన్న యాదవ, కురుమలకు కాంగ్రెస్ ప్రభుత్వం, పార్టీలో తగిన ప్రాతినిధ్యం లేదన్నారు. గత ప్రభుత్వాల్లో తమకు గుర్తింపు ఉండేదని వారు గుర్తుచేశారు. 

గాంధీభవన్ మనందరిది: మహేశ్‌కుమార్‌గౌడ్ 

మంత్రివర్గం, పార్టీ, ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లో అవకాశమివ్వాలని నిరసన వ్యక్తం చేసిన యాదవ, కురుమ సంఘం నాయకులతో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ గాంధీభవన్‌లో సమావేశమయ్యారు. ఆ సంఘం నాయకుల సమస్యలను, పదవులకు సంబంధించిన అంశాలపై చర్చించారు.

గాంధీభవన్ అందరిదని, సమస్యలుంటే తమకు వచ్చి చెప్పుకోవడానికి అవకాశం ఎప్పుడు ఉంటుందని అన్నారు. కార్పొరేషన్ చైర్మన్లతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో యాదవ, కురమలకు అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు.  

భద్రతా వైఫల్యంపై కాంగ్రెస్ ఆరా..? 

యాదవ, కురుమ సామాజిక వర్గానికి చెందిన నేతలు లారీలో గొర్రెలు తీసుకుని గాంధీభవన్‌లోకి వచ్చి నిరసన వ్యక్తం చేయ గా, కాంగ్రెస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చే శా రు. పోలీసుల భద్రతా వైఫల్యంపై కాంగ్రెస్ వర్గాలు ఆరా తీసినట్లు తెలుస్తోంది. పోలీసుల కట్టుదిట్టమైన భద్రత ఉన్నా గొర్రెల లారీ లోపలికి ఎలా వచ్చిందని కాంగ్రెస్ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.