31-05-2025 02:37:24 AM
హైదరాబాద్, మే 30 (విజయక్రాంతి): ఆపరేషన్ సిందూర్లో పాకిస్థాన్ చేతిలో ఎన్ని రాఫెల్ విమానాలు కూలాయనే విషయంపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలంటూ సీఎం రేవంత్రెడ్డి చేసిన పాకిస్థాన్ అనుకూల వ్యాఖ్యలు దేనికి సంకేతమని బీజేపీ ఓబీసీ మోర్చాజాతీయ అధ్యక్షుడు, ఎంపీ డాక్టర్ కే లక్ష్మణ్ ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి తీరుపై శుక్రవారం ఆయన ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం, నిరాధారణమైనవని తేల్చారు.
ఆపరేషన్ సిందూర్ పేరుతో రాఫెల్ యుద్ధ విమానాలు కోల్పోయామని చెప్పడం అత్యంత దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని విమర్శించారు. సైన్యం మనోభావాలను గాయపర్చడమే కాకుండా.. మన దేశాన్ని అవమానించేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ, బీజేపీపై ఉన్న అక్కసును ఆర్మీ మీద, దేశంపైన వెల్లగక్కుతున్నారని వాపోయారు.
పాకిస్థాన్ అనుకూల వ్యాఖ్యలు దేనికి సంకేతమని నిలదీశారు. ప్రధాని మోదీ ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేస్తున్నారని, ఈ అంశంలో రేవంత్రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. దేశ ప్రజలంతా రేవంత్ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించాలన్నారు. రాఫెలే కాదు యుద్ధంలో ఒక్క విమానం కూడా కూలిపోలేదని స్పష్టం చేశారు.