ఈ వాటర్ మార్కేంటి!
విద్యార్థులకు నోట్బుక్ల సరఫరా టెండర్లపై సీఎం రేవంత్రెడ్డి ఆశ్చర్యం
నిక్కచ్చిగా వ్యవహరించిన సీఎం
రూ. 90 కోట్ల ప్రజాధనం ఆదా
రూ. 150 కోట్లకు టెండర్లు పిలిచి వాటర్ మార్క్ నిబంధన పెట్టిన అధికారులు
రూ. 60 కోట్లకే అప్పజెప్పేలా సీఎం ఆదేశాలు
ఇతర రాష్ట్రాల్లోని కార్పొ రేట్ కంపెనీలకు దక్కేలా అధికారుల ప్రయత్నాలు
ఒక్కో నోట్బుక్ ధర.. 87 రూపాయల నుంచి 42కు తగ్గించిన సీఎం
ముఖ్యమంత్రి చొరవపై ఎంఎస్ఎంఈల హర్షం
* వాటర్ మార్క్ ఖరీదైన విషయం. ఫోర్జరీకి తావుండొద్దని కరెన్సీ నోట్లు, బాండ్ పేపర్లు, స్టాంపులపై మాత్రమే వాటర్మార్క్ వినియోగిస్తారు. కానీ, పిల్లలకు అందించే నోట్బుక్స్పై వాటర్ మార్క్ ఉండాలని అధికారులు విచిత్రమైన నిబంధన పెట్టారు. దీనివల్ల ప్రభుత్వం ఒక్కో నోట్బుక్కు రూ.87 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. టెండర్ విలువ రూ.150 కోట్లకు చేరుతుంది. ఈ విషయాన్ని గుర్తించిన సీఎం రేవంత్రెడ్డి ఆ ప్రతిపాదనను అడ్డుకున్నారు. ఫలితంగా ఒక నోట్ బుక్ ధర రూ.42కి, టెండర్ విలువ రూ.60 కోట్లకు దిగి వచ్చింది.
హైదరాబాద్, మే 25 (విజయక్రాంతి): కఠిన నిబంధనల పేరుతో ప్రజాధనాన్ని కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పే ప్రయత్నాన్ని ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అడ్డుకున్నారు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ. 90 కోట్ల వరకు ఆదా అయినట్టుగా తెలుస్తుంది. గురుకులాలు, పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యా ర్థులకు నోట్ బుక్లకు సరఫరా చేసేందుకు రూ. 150 కోట్లతో పిలిచిన టెండర్లను, కేవలం ఒకట్రెండు నిబంధనలను సాకుగా చూపి..
ఇతర రాష్ట్రాల్లోని కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పేలా వ్యూహంపన్నిన అధికారుల ప్రయత్నాలను సాక్షాత్తు సీఎం అడ్డుకున్నారు. స్థానికంగా ఉండే ఎంఎస్ఎంఈలకు ఉపాధి దొరికేలా, పని లభించేలా చర్యలు తీసుకోవడంతో.. కేవలం రూ. 60 కోట్లతోనే కావాల్సిన టెండరును ముగించడంతో.. సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
9.24 లక్షల మంది విద్యార్థులకు..
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మైనారిటీ, కస్తూర్బా, సాంఘిక సంక్షేమం, బీసీ సంక్షేమం, గిరిజన సంక్షేమం, ఆదర్శ పాఠశాలలు, గిరిజన ఆశ్రమ పాఠశాలలు, సంక్షేమ వసతిగృహాలు.. ఇలా మొత్తం సుమారు 10 రకాల గురుకులాలు, పాఠశాలల్లో చదువుకుంటున్న 9.24 లక్షల మంది విద్యార్థులకు 2026-27 విద్యా సంవత్సరంలో ట్రాలీ బ్యాగ్లు, యూనిఫాం, బెల్ట్, టై, దుప్పట్లు, సాక్స్, బ్యాగ్, రగ్గులు, మ్యాట్, పీటీ డ్రెస్, నైట్ డ్రెస్, ట్రాక్ సూట్ లాంటి 22 రకాల వస్తువులను ఇవ్వాలని ప్రభుత్వ సంకల్పించింది. ఇందులో నోట్బుక్లుకూడా ఉన్నాయి.
ఏ జిల్లాకు ఆ జిల్లాగా గతంలో ఆయా వస్తువులకు టెండర్లు పిలిచి సరఫరా చేసేవారు. అయితే ఇలా ఏ జిల్లాకు ఆ జిల్లాకు పిలిస్తే.. ధరల్లో, నాణ్యతలో అనేక తేడాలు ఉన్నట్టుగా ప్రభుత్వం గ్రహించి.. రాష్ట్ర స్థాయిలో కామన్ ప్రొక్యూర్మెంట్ విధానంలో వీటిని కొనుగోలు చేసేందుకు వీలుగా, ఒక ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ (పీఎంయూ)ను ఏర్పాటు చేసి టెండర్లు పిలిచారు.
నోట్బుక్లకు రూ. 150 కోట్లు..
ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 9.24 లక్షల మంది విద్యార్థులకు నోట్బుక్లను సరఫరా చేసేందుకు వీలుగా రూ. 150 కోట్లతో టెండర్లు పిలిచారు. అయితే ఎలాంటి అక్రమాలు జరగకుండా, విద్యార్థులకు అందించే నోట్బుక్లు బయటి మార్కె ట్లో అమ్ముకునే ప్రయత్నాలు ఉండవద్దనే ఉ ద్దేశంతో.. అధికారులు అతి జాగ్రత్తకు వెళ్ళా రు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న కొన్ని కార్పొరేట్ కంపెనీలకే ఈ టెండర్లు దక్కేలా అధికారులు కఠినమైన నిబంధనలను రూపొందించారు.
నోట్బుక్లకు ‘వాటర్ మార్క్’ ఏర్పాటు చేయాలనే నిబంధనతో.. రాష్ట్రంలోని ఎంఎస్ఎంఈ (మధ్య, చిన్న, సూక్ష్మ పరిశ్రమ లు)లకు స్థానికంగా పని దొరకని పరిస్థితి ఎదురయ్యింది. వాటర్ మార్క్ అనేది కేవ లం కరెన్సీ నోట్లు, బాండ్ పేపర్లు, స్టాంప్ పేపర్లు, స్టాంప్లుపై మాత్రమే ముద్రిస్తారు. వాటర్మార్క్ను నోట్బుక్లపై ముద్రించే సాంకేతిక దేశవ్యాప్తంగా రెండు, మూడు కార్పొరేట్ కంపెనీలకే ఉండటం గమనార్హం.
సీఎం ఆశ్చర్యం..
నోట్బుక్లకు రూ.150 కోట్లతో టెండ ర్లు పిలిచి అంశం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దృష్టికి వెళ్ళింది. దీనిపై సీఎం సమీక్షిం చారు. ఈ సమీక్షలో నోట్ బుక్లపై వాటర్ మార్క్ ఏర్పాటుతో.. నోట్బుక్ల ధర పెరిగిందని, ఒక్కో నోట్ బుక్ ధర రూ. 87 వర కు ఉందని అధికారులు చెప్పుకొచ్చారు. దీని తో నోట్బుక్లపై వాటర్ మార్కా.. అంటూ సీఎం సైతం ఆశ్చర్యపోయారు. నోట్ బుక్లపై వాడటం అవసరమా అంటూ అసంతృప్తని వ్యక్తంచేసినట్టుగా సమాచారం.
రూ. 90 కోట్లు మిగులు..
ఇతర రాష్ట్రాల్లోని కార్పొరేట్ కంపెనీలకే కట్టబెట్టేలా వాటర్ మార్క్ ప్రయోగాన్ని అ డ్డుకున్న సీఎం.. రాష్ట్ర ప్రభుత్వ సంస్థ ద్వారా నోట్బుక్లను సరఫరా చేసేలా చర్యలు తీసుకున్నట్టు సమాచారం. దీనితో 87 రూ పాయలకు ఒక నోట్ బుక్ ధర ఉండగా.. అ దికాస్తా.. 42 రూపాయలకు చేరుకుంది. దీని తో రూ. 150 కోట్ల టెండరు కాస్తా.. రూ. 60 కోట్లతోనే ముగియడంతో.. అధికారుల గొం తులో పచ్చివెలక్కాయ పడ్డట్టయ్యింది.
దీని తో మొత్తం రూ. 90 కోట్ల ప్రజాధనం పక్కదారి పట్టకుండా సాక్షాత్తు సీఎం రేవంత్రెడ్డి అడ్డుకున్నట్టుగా అధికారవర్గాల్లోనూ చర్చ కొనసాగుతోంది. నోట్బుక్ల పేరుతో గొప్ప గా చెప్పుకునేలా వాటర్ మార్క్ ప్రతిపాదనలను తయారుచేసిన అధికారయంత్రాంగం.. ఇప్పుడు సీంఎ జోక్యంతో.. రూ. 150 కోట్ల టెండర్ను కాస్తా.. రూ. 60 కోట్లకే (వాటర్ మార్క్ లేకుండా) ప్రభుత్వ రంగ సంస్థకు అప్పజెప్పుతున్నారు. దీనితో రూ. 90 కోట్ల ప్రజాధనం ప్రభుత్వ ఖజానాకు చిల్లుపడకుండా సీఎం కాపాడినట్టు కొందరు అధికా రులు సైతం మెచ్చుకుంటున్నారు.
ఎంఎస్ఎంఈల్లో హర్షం..
ప్రభుత్వ రంగ సంస్థకు అప్పజెప్పిన నోట్బుక్ల సరఫరా టెండర్పై ఎంఎస్ఎంఈలు హర్షం వ్యక్తంచేస్తున్నాయి. ఎంఎస్ఎంఈలకు ఉపాధి కలుగుతుందని, పని దొరుకు తుందని కార్మికులు, యాజమాన్యాలు చెబుతున్నారు. సీఎం జోక్యంతో ప్రజాధనం వృధా కాకుండా అడ్డుకోవడం, ఎంఎస్ఎంఈలకు ఉపాధి కలిగేలా చొరవ తీసుకున్నం దుకు వారందరూ హర్షం వ్యక్తంచేస్తున్నారు.






