05-06-2025 12:00:00 AM
నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం:
సంపతి రమేష్ మహారాజ్:-
భూగోళంపై జీవజాతుల మనుగడ పర్యావరణంపై ఆధారపడి ఉంటుంది. భూమిపై గాలి, నీరు, నేలతోపాటు మొక్కలు, జంతువులు పర్యావరణ వ్యవస్థలో భాగం. వీటిని కాపాడవలసిన బాధ్యత అందరిపైనా ఉంది. ఈ క్రమంలో ఐక్యరాజ్యసమితి పర్యావరణంపై అవగాహన కలిగిస్తూ సంరక్షణ చర్యలు చేపట్టడానికి 1972 జూన్ 5న ‘ప్రపంచ పర్యావరణ దినోత్సవాని’కి శ్రీకారం చుట్టింది.
నేడు మానవ చర్యలు పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగిస్తూ ప్రకృతి వినాశనానికి దారి తీస్తున్నాయి. ఈ సందర్భంగా ‘ప్లాస్టిక్ కాలుష్యా న్ని అంతం’ (బీట్ ప్లాస్టిక్ పొల్యుషన్- 2025) చేయడంపై పర్యావరణ ప్రేమికులు, ప్రజలు దృష్టి పెట్టాల్సిందిగా నిపు ణులు పిలుపు ఇస్తున్నారు. పర్యావరణ సవాళ్లను అధిగమించడానికి ప్రపంచ దేశాలు ఉమ్మడిగా జరుపుకునే ఈ వేడుకలను రిపబ్లిక్ ఆఫ్ కొరియా నిర్వహిస్తుంది.
సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో భాగమైన వాతావరణ మార్పులను అరికట్టడం, సుస్థిర ఉత్పత్తి, వినియోగం, సముద్రాలు, మహాసముద్రాల రక్షణ, పర్యావరణ వ్యవస్థల మరమ్మతు, జీవ వైవిధ్య సంరక్షణకు ప్లాస్టిక్ కాలుష్యాన్ని నిర్మూలించడం ప్రాధాన్యాంశాలుగా ఉన్నాయి.
ప్లాస్టిక్ భూమిలో నిర్వీర్యం కావడానికి చాలా ఏళ్లు పడుతుంది. ప్లాస్టిక్లోని రసాయనాలు మొక్కలు పెరగకుండా అడ్డుకుం టాయి. భూసారం దెబ్బతింటుంది. వేడి ఆహార పదార్థాలు ప్లాస్టిక్ కవర్లలో నిల్వచేయడం వల్ల అవి పూర్తిగా విషపూరిత మవుతాయి. ప్లాస్టిక్ను తినే అమాయక మూగజీవులు మృత్యువాత పడుతున్నాయి.
‘ది హిమాలయన్ క్లీనప్-2024’ నివేదిక ప్రకారం, భారతీయ హిమాలయాలలో 70% కంటే ఎక్కువ ప్లాస్టిక్ వ్యర్థాలు పునర్వినియోగ పరచలేనివిగా ఉన్నట్టు పేర్కొన్నది. సింగిల్ యూజ్ ఫుడ్ పానీయాల ప్యాకేజింగ్ కాలుష్యానికి ప్రధాన వనరుగా ఉంది. భారత్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని 2022 జూలై 1 నుంచి నిషేధించింది. అయినప్పటికీ అనేకులు దీని వినియోగాన్ని ఆపడం లేదు.
ఆదర్శంగా భారత్ చర్యలు
పెరుగుతున్న జనాభా, పట్టణీకరణ, పారిశ్రామికీకరణ వల్ల సహజ వనరులపై తీవ్ర ఒత్తిడి పెరుగుతున్నది. అడవుల నరికివేత, వాహన కాలుష్యం, రసాయన ఎరు వుల వాడకం, గనుల తవ్వకాలు వంటివాటివల్ల వాతావరణ కాలుష్యం విపరీతంగా పెరుగుతోంది. ఫలితంగా కార్బన్ డై ఆక్సైడ్, మిథేన్, నైట్రస్ ఆక్సైడ్ వంటి హరితగృహ వాయువులు మోతాదుకు మించి విడుదలవుతున్నాయి.
దీంతో ఉష్ణోగ్రతల పెరుగుదల, రుతు పవనాలు గతి తప్పి వరదలు, కరువులు సంభవించడం, హిమన దాలు కరగడం, భూకంపాలు వంటి ప్రకృ తి విపత్తులు సంభవిస్తున్నాయి. ఇప్పటికే భారత్ వాయు కాలుష్యంలో బంగ్లాదేశ్, పాకిస్థాన్ తరవాత మూడవ స్థానంలో ఉంది. దేశ రాజధాని ఢిల్లీ కాలుష్య రాజధానిగా అపకీర్తిని మోస్తోంది. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో వాతావరణ సదస్సులో భాగంగా కర్బన ఉద్గారాలను తగ్గించడానికి 1997లో క్యోటో ప్రొటోకాల్ తెచ్చారు.
ఈ ఒప్పందం అభివృద్ధి చెందుతున్న దేశాలకు కొన్ని మినహాయింపులు ఇవ్వడంతో పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. అనంతరం ప్రపంచదేశాలన్నీ స్వచ్ఛందంగా కర్బన ఉద్గారాలు తగ్గించాలనే దీర్ఘకాల లక్ష్యంతో 2015లో పారిస్ ఒప్పందం జరిగింది.
ఇందులో ఉష్ణోగ్రతలను పారిశ్రా మిక పూర్వస్థాయికంటే 2 డిగ్రీల సెల్సియస్కు తగ్గించి, 1.5 డిగ్రీల సెల్సియస్కు పరి మితం చేయాలనీ తీర్మానించారు. ధనిక దేశాలు పేద దేశాలకు ప్రతి ఏటా 100 బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయం అందించా లని కూడా నిర్ణయించారు.
ఈ ఒప్పందం 2020 నుంచి అమల్లోకి వచ్చింది. కానీ, నేటికీ ఆచరణలో ఆశించి న స్థాయిలో ముందుకు పోవడం లేదు. ఇప్పటికే ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీలు దాటినట్లు అధ్యయనాలు చాటుతున్నాయి. కా ర్బన్ ఉద్గారాలలో మొదటిస్థానంలో చై నా, తదుపరి అమెరికా, ఇండియా దేశాలు ఉన్నాయి. మరోవైపు అమెరికా వంటి అగ్రదేశాలు పారిస్ ఒప్పందం నుంచి వైదొ లగడం ఆందోళనకరం.
ఈ క్రమంలో భారత్ కర్బన ఉద్గారాల కట్టడికై నూతన ఐఎన్డీ లక్ష్యాలను సమర్పించి ఆదర్శంగా నిలుస్తుంది. ఇలా భారతదేశం తన జీడీపీలో ఉద్గారాల తీవ్రతను 2005 స్థాయినుంచి 2030 నాటికి 45 శాతం తగ్గిస్తుంది. 2030 నాటికి శిలాజేతర ఇంధన వనరుల నుంచి 50 శాతం విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని పెంపొందించుకునే ప్రయత్నం చేస్తున్నది.
చెట్లు నాటడం, అడవులు పెంచడం ద్వారా 2.5 నుంచి 3 బిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ను తగ్గించాలనీ చూస్తున్నది. ఈ చర్యలతో 2070 నాటికి కర్బన ఉద్గారాలు సున్న స్థాయికి తగ్గించే బృహత్ లక్ష్యం దిశగా భారత్ అడుగులు వేస్తున్నది.
పేద ప్రజలపైనే అధిక ప్రభావం
ప్రస్తుతం భూగోళానికి వ్యతిరేకంగా సాగుతున్న హింసకు మరోపేరు పర్యావరణ విధ్వంసం. ఇందులో రేపటి తరం వనరులను నేటితరం దోచుకుంటున్నది. తద్వారా భవిష్యత్తు ముప్పునకు మనమందరం బాధ్యులమే అవుతాం. కనుక, వాతావరణ మార్పుల కట్టడి ప్రపంచ దేశాల ప్రధాన ఎజెండా కావాలి. ప్రపంచ దేశాలు బొగ్గునుంచి ఉత్పత్తయ్యే థర్మల్ విద్యుత్తును తగ్గించాలి.
హైడ్రో పవర్, సోలార్ పవర్, బయో ఎనర్జీ వంటి శిలాజేతర ఇంధనాల వైపు పూర్తిస్థాయిలో మళ్ళాలి. విద్యుత్ వాహనాల వాడకం పెద్ద ఎత్తున పెరగాలి. ఇప్పటికే భారత్ అంతర్జాతీయ ‘సోలార్ అలియన్స్ కూటమి’ ద్వారా సౌరశక్తి అభివృద్ధికి కృషి చేస్తున్నది. పర్యావరణాన్ని రక్షించడానికి ‘లైఫ్’ అనే కార్యక్రమం ద్వారా ప్రజల జీవనశైలిలో మార్పు తేనుంది. జాతీయ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ద్వారా హరిత ఇంధన ఉత్పత్తికి కృషి చేస్తున్నది.
ఆధిపత్య పెట్టుబడిదారి వర్గాల చేతుల్లోనే ప్రభుత్వాలు, పరిశ్రమలు ఉన్నాయి. వీరికి అనుకూలంగానే చట్టాలు మలుచుకుంటున్నారు. వా రు ఇష్టారీతిన నెలకొల్పే పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యానికి సామాన్యులే బలవుతున్నారు. అంటే, కొందరి చర్యలకు అందరూ ప్రభావానికి లోనవుతున్న పరిస్థితి. దీంతో ఇటీవల వాతావరణ ప్రతికూ ల ప్రభావాలను ఎదుర్కొనే హక్కును రాజ్యాంగంలోని అధికరణ 14 (సమానత్వ హక్కు), 21 (జీవించే హక్కు) కింద సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కులను విస్తరించింది.
ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు పర్యావరణ చట్టాలను పటిష్టంగా అమలు పర చాలి. సేంద్రియ వ్యవసాయాన్ని అధిక స్థాయిలో ప్రోత్సహించాలి. పాఠశాల, కళాశాల విద్యార్థులకు పర్యావరణం పట్ల అవ గాహన కలిగించాలి. మొక్కలు నాటే కార్యక్రమం నిత్యఉద్యమంగా కొనసాగించాలి.
ఘనవ్యర్థ పదార్థాల రీసైక్లింగ్ ద్వారా వ్యర్థాలను తగ్గించాలి. ఎలక్ట్రిక్ వాహనాల సం ఖ్యను పెంచి వాయు కాలుష్యాన్ని తగ్గించాలి. ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయ పరిష్కా రంతో ముందుకెళ్లాలి. ప్రతీ దేశం ప్యారిస్ ఒప్పందానికి కట్టుబడి ఉండాలి. అప్పుడే సుస్థిరాభివృద్ధికి బాటలు పడతాయి.
వ్యాసకర్త సెల్: 7989579428