05-06-2025 12:00:00 AM
సమస్యల్లో పల్లె దవాఖానలు
మహబూబాబాద్, జూన్ 4 (విజయ క్రాంతి): గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు అందుబాటులో వైద్య సేవలు అందించేందుకు జాతీయ హెల్త్ మిషన్ (ఎన్.హెచ్.ఎం) కార్యక్రమంలో ఏర్పాటు చేసిన పల్లె దవాఖానాలను సమస్యలు పట్టిపీడిస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా 139 పల్లె దవాఖానాలు పనిచేస్తున్నాయి.
ఇందులో 117 చోట్ల వైద్యులు ఉండగా, 22 పల్లె దవాఖానాల్లో వైద్యుల పోస్టులు ఖాళీ ఉండటంతో ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలే వైద్య సేవలు అందిస్తున్నారు. ఒక్కో పల్లె దవాఖాలలో ఎంబీబీఎస్, బిఏఎంఎస్, బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన ఒకరిని (మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్) ఎం.ఎల్.హెచ్.పి గా నియమించాల్సి ఉంది. అలాగే ఏఎన్ఎం1, ఏఎన్ఎం 2, ఏఎన్ఎం3, ఆశా కార్యకర్తలను ఎం.ఎల్.హెచ్.పి లకు సహాయంగా వైద్య సేవల కోసం ఒక్కోపల్లె దవాఖానకు నియమించాల్సి ఉంటుంది.
పల్లె దవాఖానాల్లో ప్రజలకు వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. ప్రమాద ఘటనల్లో ప్రధమ చికిత్స చేయాల్సి ఉంటుంది. వివిధ రకాల జబ్బుల నివారణకు వైద్య సహాయం అందించాల్సి ఉంటుంది. అలాగే నిత్య జీవన వ్యాధుల నిర్వహణ తోపాటు ఆరోగ్య కేంద్రం పరిధిలోని గ్రామస్తుల ఆరోగ్య పరిస్థితిలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాల్సి ఉంటుంది. ఆరోగ్య జాగ్రత్తలు, శుభ్రత గురించి అవగాహన కల్పించాల్సి ఉంటుంది.
టెలి మెడిసిన్ విధానంలో వైద్యుల సలహా, సూచనలతో వైద్యం అందించడం, మందులు అందించి అందుబాటులో ఉండే విధంగా విధులు నిర్వహించాల్సి ఉంటుంది. తమ పరిధికి మించి వైద్యం చేయాల్సి వస్తే వారిని మండల, జిల్లా ఆసుపత్రులకు పంపించాల్సి ఉంటుంది. పలు పల్లె దవాఖానాలకు పక్క భవనాలను నిర్మించడంతో పాటు అన్ని వసతులు కల్పించారు. అలాగే అన్ని పల్లె దవాఖానాలకు వైద్యులను, ఏఎన్ఎంలను, ఆశాలను నియమించారు.
మొదట్లో గ్రామీణ ప్రాంత ప్రజలకు ఈ పల్లె దవాఖానాల ద్వారా మెరుగైన వైద్య సేవలు అందేవి. అయితే రాను రాను వీటి ఆలనా పాలన పట్టించుకునే వారు కరువయ్యారని, అనేక దవాఖానాల్లో పనిచేసే వైద్యులు ఇంతకంటే మెరుగైన ఉద్యోగం రావడంతో కొందరు రాజీనామా చేసి వెళ్లిపోవడం తో ఖాళీ ఏర్పడ్డ 22 మంది ఎం.ఎల్.హెచ్.పీ పోస్టులను భర్తీ చేయకపోవడంతో ఖాళీ ఏర్పడ్డ పల్లె దవాఖానాల్లో వైద్య సేవలు కుంటుపడ్డాయి. ఇక రెగ్యులర్ ఏఎన్ఎంలు పోస్టులు 113 ఖాళీలున్నాయి. అలాగే రెండవ ఏఎన్ఎం పోస్టులు 12 చోట్ల ఖాళీలున్నాయి. దీనితో ఆయా పల్లె దవాఖానాల్లో ప్రజలకు సరైన వైద్య సేవలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సౌకర్యాలను పట్టించుకోవడం లేదు
పలు పల్లె దవాఖానాలకు సరైన విద్యుత్ సౌకర్యం లేదని, మరి కొన్నిచోట్ల నీటి వసతి లేదని, ఇంకొన్ని చోట్ల నిర్వహణ సరిగా లేక ఇబ్బంది పడుతున్నారు. కల్వల పల్లె దవాఖానలో నీటి సంపు పైకప్పు పగిలిపోయి, చెత్తాచెదారం నిండి ఉన్న అదే నీటిని అవసరాలకు వినియోగిస్తున్నారు. ఇక కేసముద్రం పల్లె దవాఖానకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వకపోవడంతో అక్రమంగా విద్యుత్ వినియోగిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి వచ్చే వర్షాకాలంలోపు ఖాళీగా ఉన్న వైద్యులు, ఏఎన్ఎం పోస్టులను భర్తీ చేసి, సౌకర్యాలను మెరుగుపరిచి ప్రజలకు అందుబాటులో వైద్య సేవలు ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
వైద్యం కోసం అటూ ఇటూ తిరగాల్సి వస్తోంది
గ్రామంలో ఉన్న దవాఖానలో డాక్టర్ లేకపోవడం వల్ల ఏఎన్ఎం ఇచ్చే మందులకు రోగం తగ్గకపోతే పెద్ద దవాఖాలకు పోవాల్సి వస్తోంది. అటు ఇటు తిరగడం ఇబ్బందిగా మారింది. ఇక్కడనే డాక్టర్ ఉంటే ఎటు తిరగకుండా ఒక్క కాన్నే డాక్టర్ కు చూపించుకుని రోగం నయం చేసుకునే పరిస్థితి ఉంది. దవాఖానకు డాక్టర్ ను నియమించాలి.
లింగాల సురేష్, గ్రామస్తుడు, కల్వల, మహబూబాబాద్ జిల్లా