ఆ.. ముగ్గురెవరు?
- జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపికపై బీజేపీ కసరత్తు
- త్రిసభ్య కమిటీ భేటీ.. అభిప్రాయాల సేకరణ
- జాతీయ నాయకత్వానికి తుది జాబితా
- నేడు లేదా రేపు అభ్యర్థిని ప్రకటించే అవకాశం
హైదరాబాద్, అక్టోబర్ 7 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపికపై బీజేపీ తీవ్ర కసరత్తు చేస్తోంది. ఈ మేరకు పార్టీ అధిష్టానం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ అభిప్రాయ సేకరణలో తలమునలకలైంది. పరిశీలనలో ఉన్న అభ్య ర్థులపై కమిటీ ఆరా తీస్తోంది. హైదరాబాద్ సెంట్రల్ జిల్లా ముఖ్య నేతలతోపాటు, జూబ్లీహిల్స్ నియోజకవర్గ నేతల నుంచి కమిటీ అభిప్రాయాలను సేకరించి పలువురి పేర్లను అధిష్టానికి పంపనుంది.
అయితే, మంగళవారం కమిటీ చేపట్టిన అభిప్రాయ సేకరణ కు జూబ్లీహిల్స్ నుంచి టికెట్ ఆశిస్తున్న కీర్తిరెడ్డి, లంకల దీపక్ రెడ్డి, ఆకుల విజయ, అట్లూరి రామకృష్ణ హాజరయ్యారు. అలాగే వైద్యురాలు వీరపనేని పద్మ కూడా ఇక్కడి నుంచి టికెట్ రేసులో ఉన్నట్లు తెలిసింది. అభ్యర్థుల పేర్లతో కూడిన తుది నివేదికను రాష్ట్ర నాయకత్వానికి త్రిసభ్య కమిటీ అందజేయనుంది.
ఆ తర్వాత జాతీయ పార్టీ నాయకత్వానికి ప్రాధాన్యతా క్రమంలో ముగ్గురి పేర్ల జాబితాను బీజేపీ రాష్ట్ర అధ్యక్షడు రాంచందర్రావు పంపనున్నారు. ఆ జాబితాను అధిష్ఠానం పరిశీలించి నేడు లేదా రేపు అభ్యర్థిని ప్రకటించే అవకాశముందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
గెలుపుపై బీజేపీ ధీమా
బీజేపీకి గ్రామాల్లో కంటే కూడా అర్బన్ ఏరియాల్లో పట్టు ఎక్కువగా ఉంది. అందులోనూ హైదరాబాద్ మహానగరంలో యు వత, ఉద్యోగులు ఎక్కువగా ఉండటంతో ఉప ఎన్నికలో గెలుస్తామన్న ధీమా వ్యక్తం చేస్తోంది.
ఇందుకు మాగంటి సునీతపై ఉన్న సానుభూతిని గెలిచే నేత కోసం ఆ పార్టీ తర్జనభర్జన పడుతున్నట్లుగా తెలుస్తోంది. 2023 ఎన్నికల్లో లంకల దీపక్ రెడ్డి పోటీ చేశారు. అయితే పార్టీ మాత్రం ఈయన వైపే మొగ్గు చూపుతున్నట్లుగా పార్టీ నాయకుల్లో ప్రచారం జరుగుతోంది.




