31-05-2025 03:00:42 AM
హైదరాబాద్, మే 30 (విజయక్రాంతి): బీఆర్ఎస్ పార్టీ నియమావలిని ఎవరు ధిక్కరించినా తన, మన భేదం లేకుండా సొంత బిడ్డలనైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదని అనేక సందర్భాల్లో ప్రకటించిన కేసీఆర్.. నేడు తన కూతురు విషయంలో ఎందుకు వెనుకడుగు వేస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ శుక్రవారం ప్రకటనలో కేసీఆర్ను ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీలో అగ్రకులాలకు ఒక న్యాయం, బీసీలకు ఇంకొక న్యాయమా అని నిలదీశారు.
బీఆర్ఎస్ పార్టీకి మేము కూడా ఓనర్లమే అని వ్యాఖ్యానించిన ఈటల రాజేందర్ను మంత్రి పదవి నుంచి తొలగించారని, పార్టీ నియమావళిని ఉల్లంఘించారని టైగర్ నరేంద్ర, విజయశాంతిలను పార్టీ నుంచి బహిష్కరించారని గుర్తు చేశారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నియమాలను ఉల్లంఘిస్తున్న కవితను ఎందుకు పార్టీ నుంచి ఎందుకు గెంటివేయ డం లేదని జాజుల శ్రీనివాస్గౌడ్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ మహిళలు మాట్లాడితే అధిష్టానం ఇలాగే మౌనంగా ఉండేదా అని ఆయన నిలదీశారు.
బీఆర్ఎస్ పార్టీకి దమ్ముంటే కవితపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే బీఆర్ఎస్ పార్టీలో కేవలం బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలను మాత్రమే బలి చేస్తామని, అగ్రకులాల జోలికి, అలాగే కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోలేమని కేసీఆర్ బహిరంగంగా ప్రకటించాలని కోరారు. లేదంటే బీసీ బిడ్డలైన ఈటల రాజేందర్, ఆలే నరేంద్ర, విజయశాంతిలను బహిష్కరించడం తాము చేసిన తప్పిదమని ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు.