l బీరంగూడ ప్రచారంలో మంత్రి కొండ సురేఖ
పటాన్చెరు, ఏప్రిల్ 28: మెదక్ పార్లమెంట్ ఎన్నికల్లో బీసీ బిడ్డ నీలం మధును భారీ మెజారిటీతో గెలిపించాలని రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రజలను కోరారు. పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మండలం బీరంగూడ, కిష్టారెడ్డిపేట్లో నియోజకవర్గ ఇన్చార్జీ కాట శ్రీనివాస్గౌడ్ ఆధ్వర్యంలో ఆదివారం ఆమె ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశానికి, రాష్ట్రానికి బీజేపీ, బీఆర్ఎస్లు చేసిందేమి లేదన్నారు. ఇందిరమ్మ ప్రాతినిధ్యం వహించిన మెదక్ స్థానం నుంచి బీసీ బిడ్డ నీలం మధును ఎంపీగా భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
అనంతరం బొల్లారం మున్సిపాలిటీలో, సాయంత్రం గుమ్మడిదల, జిన్నారం మండల కేంద్రాలలో భారీ రోడ్ షో నిర్వహించారు. బీరంగూడలో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో మంత్రి కొండ సురేఖ సమక్షంలో తెల్లాపూర్ బీజేపీ నాయకుడు కమలాకర్ తన అనుచరులతో కలిసి కాంగ్రెస్లో చేరారు. పటేల్గూడ గ్రామ ఉపసర్పంచ్ జ్ఞానేశ్వర్ కూడా హస్తం పార్టీలో చేరారు. ఈ కార్యక్రమాలలో బొల్లారం మున్సిపల్ వైస్ చైర్మన్ అనిల్రెడ్డి, కౌన్సిలర్ చంద్రారెడ్డి, ఎంపీపీ రవీందర్గౌడ్, వైస్ ఎంపీపీ గంగురమేశ్, పార్టీ మండల అధ్యక్షుడు వడ్డె కృష్ణ తదితరులు పాల్గొన్నారు.