calender_icon.png 24 June, 2025 | 4:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అండర్ పాస్ వేయక.. విధి రాత మారక

24-06-2025 12:00:00 AM

  1. జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న  గ్రామాలకు వెళ్లేందుకు తప్పని అవస్థలు               
  2. అక్కలదేవిగూడెం వద్ద రోడ్డుపై నిరంతర ప్రమాదాలు.                                    
  3. ప్రమాదమని తెలిసినా దాటక తప్పని పరిస్థితులు        
  4. అండర్ పాస్ ఏర్పాటు చేయాలని స్థానికుల వేడుకోలు

చివ్వేంల, జూన్ 23 : రాను, రాను పెరుగుతున్న వాహనాల రద్దీ దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారి విస్తీర్ణమును పెంచుతూ వస్తుంది. ఈ క్రమంలో ఇటీవల రోడ్డును నూతనంగా ఏర్పాటు చేసి రహదారికి పక్కనే ఉన్న గ్రామాలలోకి వెళ్లేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయకపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు వారి గ్రామాలకు వెళ్లేందుకు అనేక అవస్థలు పడాల్సి వస్తుంది.

ముఖ్యంగా పలు గ్రామాలకు వెళ్లేచోట రోడ్డును అడ్డంగా దాటాల్సి వస్తుండడంతో నిరంతరం ప్రమాదాలకు గురి అవుతూ ప్రాణ, ఆర్థిక నష్టాలను చవిచూడాల్సివస్తుంది. జాతీయ రహదారి 365 పై అనేకచోట్ల ఇటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ ముఖ్యంగా చివ్వెంల మండలం అక్కలదేవిగూడెంకు వెళ్లేచోట ఇటువంటి ప్రత్యేక ఏర్పాట్లు లేకపోవడంతో ప్రజలు, విద్యార్థులు స్కూళ్లకు కాలేజీలకు, ఇతర పనులకు వెళ్ళుటకు వారు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు.

హైవే అథారిటీ అధికారులు ఎక్కడ కూడా అండర్ పాస్, సర్వీస్ రోడ్డు నిర్మించలేదు. దీనికి అనుసంధానంగా సర్వీస్ రోడ్లు నిర్మించకపోవడంతో వాహనదారులు వ్యతిరేక మార్గంలో (రాంగ్ రూట్లో) వెళ్లి ప్రమాదాల బారిన పడుతున్నారు. ప్రమాదాలు అధికంగా జరుగుతున్నా హైవే అథారిటీ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.

రహదారి నిర్మాణంలో భాగంగా ప్రాంతీయ రహదారి (సర్వీస్ రోడ్డు) ఎక్కడ అవసరం ఉందో అక్కడ వేసే అవకాశం ఉంది. ప్రధాన పట్టణాలతో పాటు పత్రి గ్రామం వద్ద సర్వీస్ రోడ్డు ఏర్పాటు  చేయాల్సి ఉంది. కానీ అక్కడ ప్రజలు ఏమి పాపం చేసారో వారికీ మాత్రం అండర్ పాస్, సర్వీస్ రోడ్స్ ఇవ్వలేదు.  దీంతో చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి.

 అండర్ పాస్ లేకనే ప్రమాదాలు :  

గత 4 సంవత్సరాల నుంచి గ్రామాలకు వచ్చుటకు అంబులెన్సు, స్కూల్ బస్సులు, రావడానికి అవకాశం లేకుండా పోయింది.  అండర్ పాస్, సర్వీస్ రోడ్డు లేకపోవటంతో ప్రజలకు ఆక్సిడెంట్ లు జరగడం ద్వారా ఇప్పటి వరకు 12మంది తీవ్రంగా గాయపడగా, 150 పశువులు చనిపోవడం, గత నలుగురు వ్యక్తులు చనిపోయారని స్థానికులు అనుకుంటున్నారు.

ఈ హైవే వలన రైతులు పొలాలకు వెళ్లడానికి తప్పనిసరిగా రోడ్డు దాటవలసి వస్తుంది. అత్యవసర పరిస్థితులలో అంబులెన్స్ రావాలంటే చందుపట్ల దాకా పోయి వెళ్ళవలసిన అవసరం వస్తుంది. ఇది గ్రామ ప్రజలకు చాలా ఇబ్బందికరంగా మారింది. ఆరు గ్రామపంచాయతీల ప్రజలు 6000 కు పైగా జనాభా ఈ అక్కలదేవిగూడెం నుండే ఖమ్మం గాని సూర్యాపేట గాని వెళ్లవలసి ఉన్నదని గ్రామ ప్రజలు చర్చించుకుంటున్నారు

 20 గ్రామాలపైనే : 

జాతీయ రహదారిని ఆనుకొని , అక్కలదేవిగూడెంతో పాటు సుమారు 20 గ్రామాలకు పైగా ఉన్నాయి. ఆ గ్రామాల ప్రజలు 6000 పైగా జనాభా కలదు,నిత్యం పిల్లలు,విద్యార్థులు, ప్రజలు, రైతులు రోడ్డు దాటేందుకు అవస్థలు పడుతున్నారు. కళాశాలలకు, పాఠశాలలకు వెళ్ళుటకు చందుపట్ల గ్రామానికి వెళ్లి తిరిగి రావాల్సి వస్తోంది. వాహనదారులకు అదనంగా ఆరు కిలో మీటర్ల దూరం పెరుగుతోంది. అంత దూరం వెళ్లలేక త్వరగా గమ్యానికి చేరుకోవాలనే ఆత్రుతతో రాంగ్ రూట్లో వెళ్లి ప్రమాదాలకు గురవుతున్నారు.

అక్కలదేవిగూడెం నుంచి సూర్యాపేట వైపు వెల్లాలి అంటే జాతీయ రహదారికి రాంగ్ రూట్ లో వెళ్లాల్సి వస్తుంది . అండర్ పాస్,సర్విస్ రోడ్డు వేయాలని గ్రామ ప్రజలు, విద్యార్థులు పలుసార్లు జిల్లా కలెక్టర్ కి, జాతీయ రహదారి అధికారులకు విన్నవించిన వారు స్పందించుకోవడం గమనించదగ్గ విషయం.

 ప్రమాదం మిగిల్చిన విషాదాలు ఎన్నో.. 

ఇటీవల అక్కలదేవిగూడెం చెందిన బుచ్చయ్య తన ద్విచక్ర వాహనంపై వస్తుండగా గుర్తు తెలియని వాహనం రాంగ్ రూట్లో వచ్చి ఢీకొట్టగా అక్కడిక్కడే దుర్మరణం చెందారు. సూర్యాపేట  పట్టణానికి చెందిన ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంపై వస్తుండగా కారు ఢీకొని చికిత్స పొందుతూ మృతి చెందారు.

ఆరు గ్రామపంచాయతీకి చెందిన బాలు, వెంకన్న, చంద్రయ్య, రామకృష్ట, పాపయ్య, మరి కొంత మంది వ్యవసాయం నిమిత్తం వెళ్లేందుకు జాతీయ రహదారి దాటుతుండగా గుర్తు తెలియని వాహనాలు ఢీకొనడంతో క్షత్తగాత్రులు అయ్యారు.

 సుమారు నెల రోజుల క్రితం ఓ డీసీఎం ముందు వెళ్తున్న ట్రాక్టర్ ఢీకొనడంతో అక్కలదేవిగూడెం కి చెందిన సైదులు అక్కడిక్కడే మృతి చెందారు. జాతీయ రహదారి 365 పైన ఇప్పటి వరకు 150 బర్రెలు, 20 గొర్రెలు, 5 ఆవులు రోడ్డు ప్రమాదం లో చనిపోయాయి. 

అండర్పాస్  ఏర్పాటు చేయాలి 

అక్కలదేవిగూడెం లోని ఎన్ హెచ్ 365 నందు అండర్పాస్ మరియు సర్వీస్ రోడ్లు లేకపోవడంతో రోడ్డు పక్క గ్రామాల ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు. గత నాలుగు సంవత్సరాల నుండి ఎంతోమంది ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారు. ఇక మూగజీవాల లెక్క అయితే దేవుడికే ఎరుక. ఇదే విషయం గురించి సూర్యాపేట కలెక్టర్ కు,  జాతీయ రహదారి అధికారులకు లిఖితపూర్వకంగా  ఇచ్చిన పట్టించుకునే నాధుడే కరువైండు. ఇప్పటికైనా అండర్ పాస్ ఏర్పాటు చేసి ప్రమాదాలను నివారించాలి.

 పుట్ట వెంకటేశ్వర్లు, అక్కలదేవిగూడెం, చివ్వెంల మండలం

 కుటుంబ పెద్దను కోల్పోయా.. 

 అక్కలదేవిగూడెం గ్రామంలో జాతీయ రహదారి 365 పైన బైక్ మీద వెళుతున్న నా భర్త బుచ్చయ్య రహదారి దాటుతోండగా  వెనుకంగా కారు వేగంగావచ్చి ఢీ కొట్టింది. దీంతో ప్రాణాలు అక్కడికి అక్కడే కోల్పోయాడు. కుటుంబ పెద్దను కోల్పోయిన నేను జీవన ఆధారం సైతం కొల్పాయాను. నాకు ఇద్దరు ఆడ పిల్లలు వారిని పోషించుకోవడం ఇబ్బంది అవుతుంది. కాబట్టి ప్రభుత్వం మా గ్రామంలో అండర్పాస్ సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేయాలి. లేకపోతే నాలాగా ఎంతోమంది మహిళలు ఇబ్బందులు పడాల్సి వస్తది.

 మండవ లక్ష్మి (బాధితురాలు), అక్కలదేవిగూడెం, చివ్వెంల మండలం