30-06-2025 04:05:58 PM
నాగార్జునసాగర్,(విజయక్రాంతి): నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం జునుతుల గ్రామానికి చెందిన మంకెన జ్యోతిని అదే గ్రామంలో ఆర్ఎంపిగా పనిచేస్తున్న మహేష్ అత్యాచారం చేసి, అనంతరం ఆమెను హత్య చేసేందుకు ప్రయత్నించిన ఘటన చోటు చేసుకుంది. మృతురాలు మిర్యాలగూడకు జీవనోపాధి కొరకు వలస వెళ్లి అక్కడ జీవనం సాగిస్తున్నారు. జ్యోతి అప్పుడప్పుడు సొంత గ్రామమైన జూనుతులకు వచ్చి వెళ్ళేది. అదే గ్రామంలో ఆర్ఎంపీగా పని చేస్తున్న మహేశ్ తో వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తుంది. కొన్నేళ్లుగా వీరి సంబంధం మంచిగానే సాగింది.
ఎక్కడ ఏమి జరిగిందో కానీ జ్యోతిని వదిలించుకోవడానికి పక్కాగా ప్లాన్ చేసిన ఆర్ఎంపీ మహేశ్ గతరాత్రి దేవరకొండ నుంచి కారులో జ్యోతిని తీసుకెళ్తుండగా అర్థరాత్రి మార్గంమధ్యలో వస్తుండగా ఇరువురి మధ్య వాగ్వాదం జరిగినట్లు సమాచారం. మహేష్ ప్లాన్ ప్రకారం వెంట తీసుకెళ్లిన గడ్డి మందును జ్యోతికి బలవంతంగా తాగించి, అపస్మారక స్థితిలోకి వెళ్లిన తర్వాత జ్యోతిని పూడ్చిపెట్టేందుకు కారులో తీసుకెళ్లాడు. అదే దారిలో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులకు కారు అనుమానాస్పదంగా కనిపించడంతో వెంబడించి మహేష్ ను అదుపులోకి తీసుకున్నారు.
కొన ఊపిరితో ఉన్న జ్యోతిని దేవరకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి నుండి హైదరాబాద్ ఉస్మానియాకి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందింది. హంతకుడు మహేష్ ది సూర్యాపేట జిల్లా గుర్రంపొడు మండలం జూనుతల గ్రామానికి వలస వచ్చి ఇక్కడ ఆర్ఎంపిగా పని చేసుకుంటూ ఇంతటి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. మృతురాలుకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. జ్యోతిని హత్య చేసి ఆత్మ హత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని భర్త శ్రీనివాస్ రెడ్డి, బందువులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు గుర్రంపోడు ఎస్ఐ పసుపులేటి మధు తెలిపారు.