ఎస్సైలు @ మోసగాళ్లు!
వ్యాపారం పేరుతో మహిళకు రూ.1.82 కోట్లకు టోకరా
ఇద్దరు ఎస్సైలపై కేసు
నిందితులిద్దరూ అన్నదమ్ములు
సహకరించిన తండ్రి
భద్రాద్రి జిల్లా బూర్గంపాడులో ఘటన
బూర్గంపాడు, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి): మోసాలను, నేరాలను అరికట్టి బాధితులకు అండగా నిలవా ల్సిన పోలీసులే దారితప్పి అధిక లాభాల ఆశ చూపి ఓ మహిళను నమ్మించి రూ.కోట్లు వసూలు చేసి, మోసం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ ఘటన కలకలం రేపుతోంది. నమ్మించి మోసం చేసిన ఇద్దరు ఎస్సైలపై బాధితురాలు బూర్గంపాడు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
బూర్గాంపాడు మండలం సారపాకకు చెందిన భూక్య కుమారికి.. 2023లో భద్రాచలంలో ఎస్సైగా పనిచేసిన మహేష్తో పరిచయం ఏర్పడింది. ఆ క్రమంలో వ్యాపారాల్లో పెట్టుబడి పెడితే అనతి కాలంలోనే 35% వరకు అధిక లాభాలు వస్తాయని మహేష్ ఆమెను నమ్మించాడు. నమ్మించడానికి తన సోదరుడు ఖమ్మంకు చెందిన మరో ఎస్సై రాణా ప్రతాప్ను రంగంలోకి దింపాడు. ఇద్దరి మాటలు నమ్మిన కుమారి.. విడతల వారీగా సుమారు రూ.1.82 కోట్లను పెట్టుబడిగా వారికి అందజేసింది. ఈ వ్యవహారంలో ఎస్సైల తండ్రి చంద్రయ్య సైతం భాగస్వామి అయ్యాడు.
డబ్బులు అడిగితే బెదిరింపులు
పెట్టబడి పెట్టిన తర్వాత లాభాలు ఇవ్వకపోవడంతో మోసాన్ని గ్రహించిన కుమారి తాను ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని ఎస్సైలను పలుమార్లు వేడుకున్నారు. అప్పటివరకు మాయమాటలు చెప్పిన నిందితులు డబ్బు ఇవ్వకుండా దాటా వేస్తూ కాలయాపన చేశారు. విసిగి వేసారిన బాధితురాలు గట్టిగా నిలదీయడంతో బెదిరింపులకు పాల్పడ్డారు.
పోలీస్ అధికారులు కావడంతో ఏం చేసినా చెల్లుతుంది అనే ధీమాతో ఆమెను ఇబ్బందులకు గురి చేస్తూ వచ్చారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా తన డ బ్బులు తిరిగి రాకపోవడంతో బాధితురాలు సోమవారం తన వద్ద ఉన్న ఆధారాలతో బూర్గంపాడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నిందితులైన మహేష్, రాణా ప్రతా ప్, వారి తండ్రి చంద్రయ్యలపై కేసు నమోదు చేశారు.






