10-07-2025 12:00:00 AM
జిల్లా అదనపు కలెక్టర్ నగేష్
మెదక్, జూలై 9(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మహిళల చేత.. మహిళల కొరకు నిర్వహిస్తున్న ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సంబరాలు జిల్లాలో ఘనంగా ప్రారంభమయ్యాయని మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ తెలిపారు. బుధవారం సమీకృత కలెక్టరేట్లో ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సంబరాల మొదటి రోజులో భాగంగా తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు, మహిళా సంఘ సభ్యులతో కలిసి ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా నగేష్ మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల మహిళలను అన్ని అంశాల్లో సాధికారత పర్చడానికి, అలాగే స్వయం సహాయక సంఘాల సభ్యులను కోటీశ్వరులుగా మార్చడానికి ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు.
ఈ నెల 9 నుండి 11వ తేదీ వరకు జరిగే ఈ సంబరాల్లో మెదక్, నర్సాపూర్ నియోజకవర్గ వారీగా వడ్డీ లేని రుణాలు, ప్రమాద భీమా, లోన్ భీమాకి సంబందించిన చెక్కుల పంపిణి, కళాజాత ద్వారా అవగాహన కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో డిపిఎం యాదయ్య, అడల్ట్ ఎడ్యుకేషన్ జిల్లా అధికారి మురళి , ఏపిఎమ్ వెంకటస్వామి, టీఎంసీ మెప్మా సునీత, స్వయం సహాయక సభ్యులు పాల్గొన్నారు.