కార్మికుల సమస్యలు ప్రభుత్వాలకు పట్టవా
- ప్రజా వేదిక రాష్ట్ర చైర్మన్ తిరునహరి శేషు
హనుమకొండ,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ,ఆర్ టి సి, విద్యుత్, అంగన్వాడి, మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలతో పాటు ఆటో కార్మికులు, భవన నిర్మాణ కార్మికులకు ఇచ్చిన హామీలను కూడా అధికారంలోకి వచ్చిన తరువాత నెరవేర్చలేదని ప్రజావేదిక రాష్ట్ర చైర్మన్ డాక్టర్ తిరునహరి శేషు విమర్శించారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె, బలి దానాలు చేసుకుంటే గాని వారి సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం ముందుకు రాలేదని,
విద్యుత్ కార్మికులైన ఆర్టిజన్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామనే హామీని, అంగన్వాడీ టీచర్లకి 18 వేల రూపాయల వేతనం చెల్లిస్తామనే హామీని, ఆటో కార్మికులకి సంవత్సరానికి 12 వేల రూపాయల ఆర్థిక సహాయం, ఆటో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామనే హామీని, మున్సిపల్ కార్మికులను క్రమబద్దీకరణ చేస్తామనే హామీలను ప్రభుత్వం అటకెక్కించిందని విమర్శించారు. ఈ రంగాలలో కార్మికులుగా పేద క్రింది వర్గాలే పని చేస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా మేనిఫెస్టోలో కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.






