28-10-2025 12:00:00 AM
వాజేడు అక్టోబర్ 27 (విజయ క్రాంతి): వాజేడు నుండి భద్రాచలం వరకు రహదారి నిర్మించాలంటూ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలో మురుమూరు గ్రామపంచాయతీలో వాజేడు భద్రాచలం రహదారిపై సోమవారం అరుణాచలపురం గ్రామం వద్ద రాస్తారోకో నిర్వహించారు. బిఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగ కాంతరావు పిలుపుమేరకు వాజేడు మండల అధ్యక్షులు పెనుమల్ల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు.
కాగా ప్రధాన రహదారిపై బీఆర్ఎస్ నాయకులు బయటాయించి సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. సుమారు గంట సమయం లో రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి, ఇంతలో స్థానిక ఎస్త్స్ర జక్కుల సతీష్ ఆధ్వర్యంలో పోలీసుల చర్యతో నిరసన కార్యక్రమాన్ని విరమింప చేశారు. ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ నుండి గెలిచిన తెల్లం వెంకట్రావు అభివృద్ధి కొరకు కాంగ్రెస్ పార్టీ లో వెళ్తున్నానని చెప్పి 22 నెలలు గడిచిన తట్టెడు మట్టి ఎక్కడ పోసిన దాఖలాలు లేవని, ఈయనకు అభివృద్ధిపై సోయలేదని దుయ్యబట్టారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్న అభివృద్ధికి భద్రాచలం నియోజకవర్గం ఆమడ దూరంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు వచ్చి వాజేడు వెంకటాపురం మండలాలపై ప్రేమ వలకబోసిన నాయకులకు అధికారం వచ్చిన తర్వాత కళ్ళు లేని కబోదుల్లా ప్రవర్తిస్తున్నారనిఎద్దేవ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఢిల్లీ పెద్దలకు ఏజెంట్గా పని చేయటం తప్ప తెలంగాణ అభివృద్ధిపై సోయలేదని విమర్శించారు.
వాజేడు నుండి భద్రాచలం వరకు రహదారులను యుద్ధ ప్రాతిపదికన నిర్మించకపోతే దశలవారీగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ సీనియర్ నాయకులు బత్తుల శ్రీనివాస్, మాజీ సర్పంచ్ పూసం నరేష్ కుమార్, ముడిగ తిరుపతిరావు, శంకర్ దయాల్ తదితరులు పాల్గొన్నారు.