13-06-2025 12:00:00 AM
ఖైరతాబాద్, జూన్ 12 (విజయక్రాంతి) : యాదవ-కురుమలకు మంత్రి పదవి కేటాయించాలని బీసీ జన సభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడిస్తామని హెచ్చరించారు.
ఈ మేరకు గురు వారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో యాదవ కురుమ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మేకల రాములు యాదవ్ తో కలిసి మాట్లాడారు... గత అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధికంగా ఓట్లు వేసి గెలిపించిన యాదవు-కురుమలకు కాంగ్రెస్ పార్టీ మొండి చేయి చూపించిందని ఆరోపించారు.
రాహుల్ గాంధీ దేశమంతా తిరిగి చెబుతున్న సామాజిక న్యాయం అంటే ఇదేనా అని ప్రశ్నించారు. బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వారి జనాభా దామాషా ప్రకారం మంత్రివర్గంలో ప్రాతినిధ్యం ఇవ్వడం లేదని ఆరోపించారు. అనంతరం యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మేకల రాములు యాదవ్ మాట్లాడుతూ...్ర పభుత్వ పెద్దలు దిగి రాకపోతే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.
ఈనెల 27న ఇందిరాపార్కు దగ్గర నిర్వహిస్తున్న యాదవ-కురుమల ఆత్మగౌరవ సభకు జెండాలు, అజెండాలు పక్కనపెట్టి సంఘాలకు అతీతంగా హైదరాబాద్ కు యాదవ- కురుమలు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. శ్రీకృష్ణ భారతీయ యాదవ సేవా సమితి అధ్యక్షుడు కాటం నరసింహ యాదవ్, అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర కార్యదర్శి లోడంగి గోవర్ధన్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.