14-06-2025 12:00:00 AM
జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్
ములుగు,జూన్13(విజయక్రాంతి) : ప్రతిరోజు ఉదయం యోగాసనాలు చేయడం వల్ల మెరుగైన సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందవచ్చని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని గిరిజన భవన్ లో ఈనెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ముందస్తుగా నిర్వహిస్తున్న దశాబ్దపు ఉత్సవాలలో భాగంగా జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. జిల్లాలోని వివిధ శాఖల అధికారులు,కలెక్టరేట్,ఇతర కార్యాలయ సిబ్బందికి జిల్లా ఆయుష్ శాఖ అధ్వర్యంలో యోగ శిక్షకుల చే శిక్షణ నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లా అధికారులు,సిబ్బందితో కలిసి యోగ శిక్షకుల ఆధ్వర్యంలో యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిత్య జీవితంలో ప్రజలందరూ, అధికారులందరూ పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ తమ ఆరోగ్యం కోసం కూడా తప్పకుండా కొంత సమయాన్ని కేటాయించి యోగా చేస్తూ ఆరోగ్యంగా ఉండాలని కోరారు. ప్రతిరోజు యోగ చేయడం వలన బీపీ,షుగర్ వ్యాధులను అదుపులో ఉంచుకోవచ్చని అన్నారు.
యోగ చేయడం వలన మానసిక ఒత్తిడి నుండి విముక్తి పొందవచ్చని తెలిపారు. అధికారులను ప్రతిరోజు యోగా చేసి పని ఒత్తిడిని తగ్గించుకుంటూ, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. ఈనెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంనకు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని, ఆరోగ్యానికి సంబంధించిన మెలుకువలు తెలుసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు,మండల స్థాయి అధికారులు,ఇతర సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.