ఆనందంగా కుటుంబ సభ్యులతో గడపాలి
నిమ్స్ డైరెక్టర్ రాహుల్ దేవరాజ్
పంజాగుట్ట, జూన్ 30 (విజయక్రాంతి): ఉద్యోగ విరమణ అనంతరం జీవితాన్ని కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని నిమ్స్ డైరెక్టర్ రాహుల్ దేవరాజ్ ఆకాంక్షించారు. పదవీ విరమణ పొందిన నిమ్స్ ఉద్యోగులకు సన్మాన కార్యక్రమాన్ని లెర్నింగ్ సెంటరులో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా 16 మంది ఉద్యోగులను ఎగ్జిక్యూటివ్ రిజిస్ట్రార్ పరంజ్యోతితో కలిసి సన్మానించారు.అనంతరం డైరెక్టర్ మాట్లాడుతూ విధి నిర్వహణలో భాగంగా సంస్థ బలోపేతానికి ఉద్యోగులు అందించిన సేవలు ఎనలేనివన్నారు.
జీవిత ప్రయాణంలో ఉద్యోగ విరమణ ఒక ఘట్టమన్నారు. అనంతరం జీవితాన్ని ఆరోగ్యంగా, ఆనందదాయకంగా గడపాలని ప్రతి ఉద్యోగి కోరుకుంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ దయాకర్, మీడియా రిలేషన్ ఆఫీసర్ సత్య గౌడ్, అలైడ్ సైన్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ శ్రీనివాసులు, హెచ్ఆర్డీ స్టాఫ్ ఏఎన్ జ్యోతి శైలజ, డాక్టర్ మార్త రమేశ్, రాధిక, మహేశ్, ఉద్యోగులు, పదవీ విరమణ పొందిన వారి బంధువులు తదితరులు పాల్గొన్నారు.






