09-06-2025 10:57:07 PM
మహాదేవపూర్/భూపాలపల్లి (విజయక్రాంతి): వైద్యం వికటించి యువకుడు మృతి చెందిన సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా(Jayashankar Bhupalpally District) మహాదేవపూర్ మండలంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే... మహదేవపూర్ మండలం ఎలికేశ్వరం గ్రామానికి చెందిన రాళ్ల బండి నాగరాజు(26) కడుపులో మంట, విరేచనాలతో బాధపడుతూ తన తల్లిని తీసుకొని ద్విచక్రవాహనంపై మహాదేవపూర్ సామాజిక ఆరోగ్య కేంద్రానికి వచ్చాడు. అవుట్ పేషెంట్ నెంబర్ తీసుకొని డాక్టర్ మాధవి వద్దకు వెళ్ళగా ఇన్ పేషెంట్ గా ఉండుటకు డాక్టర్ బెడ్ కేటాయించి వైద్యం చేయడం జరిగింది.
ఈ వైద్యం చేస్తున్నప్పుడు యువకుడికి ఫిట్స్ రావడంతో వెంటనే ఆక్సిజన్ అందిస్తూ దానికి సంబంధించిన వైద్యం చేస్తూ ఆసుపత్రి యొక్క అంబులెన్స్ లో ఎమర్జెన్సీ కేర్ కొరకు జిల్లా ఆస్పత్రికి తరలించారు. జిల్లా ఆస్పత్రికి చేరుకునే లోపే యువకుడు మృతి చెందాడు. జిల్లా ఆస్పత్రి వైద్యులు పరీక్షించి మృతి చెందాడని తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు బంధువులు భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చేరుకొని వైద్యుల నిర్లక్ష్యం వల్లనే యువకుడు మృతి చెందాడని భూపాలపల్లి కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.