27-06-2025 12:06:25 AM
చేవెళ్ల, జూన్ 26: ఆర్మీ ఆఫీసర్ కోచింగ్ తీసుకునేందుకు తల్లిదండ్రులు డబ్బులు పంపకపోవడంతో మనస్థాపానికి గురైన ఓ యువతి ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. అందుకు ఏకంగా రైలు పట్టాలపై కారు నడుపుతూ హల్చల్ చేసింది. అడ్డుకున్న స్థానికులపైనా దాడికి యత్నించింది. ఉత్తరప్రదేశ్కు చెందిన హోమిక సోనీ (32) నానక్ రాంగూడలోని శ్రీనిక ఇన్ హాస్టల్లో ఉంటోంది.
గతంలో ఆమె ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసేది. కొన్నాళ్ల కింద ఉద్యోగం పోయింది. అంతేకాదు తన భర్త నుంచి విడాకులు కూడా తీసుకుంది. ఈ క్రమంలో ఆర్మీ ఆఫీసర్ కావాలనుకుంది. అయితే ఆర్థికంగా ఎలాంటి అవకాశాలు లేకపోవడంతో కోచింగ్ కోసం తల్లిదండ్రులను డబ్బులు అడిగింది. అయితే వారు ఎలాంటి ఆర్థిక సాయం అందించకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకోవాలనుకుంది.
ఈ క్రమంలో గురువారం ఉదయం రంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం నాగులపల్లి వద్ద పట్టాలపై కారును ఎక్కించింది. అక్కడి నుంచి శంకర్పల్లి వైపు వెళ్లే మార్గంలో నడుతుపుతుండగా రైల్వే సిబ్బం ది, స్థానికులు గమనించి అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా పట్టించుకోకుండా మరింత వేగంగా నడుపుతూ దాదాపు ఏడు కి.మీ.ల దూరం వరకు దూసుకెళ్లింది.
ఆ తర్వాత కొందరు యువకులు ఆమె కారును అడ్డగించి డోర్ తీసే ప్రయత్నం చేయగా వారిపై నాంచాక్తో దాడికి యత్నించింది. అయినా యువకులు ఆమెను కిందకు దింపి, కారును పక్కకు నిలిపారు. అక్కడికి చేరుకున్న రైల్వే సిబ్బంది హోమికను పోలీసులకు అప్పగించారు. అదే సమయంలో ఆ మార్గంలో వస్తున్న రైలులోని లోకోపైలట్ అప్రమత్తమై ఈ పరిణామాలను చూసి రైలును నిలిపివేశారు.
దీంతో ఈ మార్గంలో దాదాపు రెండు గంటల పాటు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడి, ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. కాగా పోలీసులు యువతిని, కారును అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఆమె మానసిక పరిస్థితి బాగా లేదని గుర్తించి, చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి, అక్కడి నుంచి ఉస్మానియా ఆస్పత్రిలో సైకాలజిస్టు వద్దకు వైద్య పరీక్షల కోసం పంపించారు.