11-06-2025 11:00:32 PM
ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన..
ఇబ్రహీంపట్నం: కడుపునొప్పి భరించలేక ఓ యువతి సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అదిభట్ల పోలీస్ స్టేషన్(Adibatla Police Station) పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇబ్రహీంపట్నం మండలం ఎంపీ పటేల్ గూడకు చెందిన గడుసు వెంకటేష్(46)కు భార్య, ఇద్దరు కుమార్తెలు మైత్రి, శ్రావణి, ఒక కుమారుడు సాయికిరణ్ ఉన్నారు. కాగా చిన్న కుమార్తె అయిన గడుసు మైత్రి(20), ఇబ్రహీంపట్నంలోని గురునానక్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. తనకు చెవి, కడుపునొప్పి ఉండటంతో రెండు రోజుల నుండి ఇంటి వద్ద ఉంటుంది.
అయితే.. బుధవారం ఉదయం తమ కుటుంబ సభ్యులు అందరూ పనుల నిమిత్తం బయటకు వెళ్లారు. అదే సమయంలో విపరీతమైన చెవి, కడుపునొప్పి రావడంతో, భరించలేక ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సోదరుడు సాయి కిరణ్ కూడా తన పని మీద బయటకు వెళ్లి, తిరిగి ఇంటికి వచ్చేసరికి బెడ్రూమ్ తలుపులు లోపలి నుండి గడియ పెట్టి ఉన్నది. మైత్రికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆమె స్పందించకపోవడంతో తలుపు పగలగొట్టి బెడ్రూమ్లోకి వెళ్లి చూడగా, సీలింగ్ ఫ్యాన్కు వేలాడుతూ కనిపించింది.
వెంటనే పక్కింటి వారి సహాయంతో కిందకు తీసి, 108 అంబులెన్స్లో సాయంతో వనస్థలిపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ డ్యూటీ డాక్టర్ గమనించి అప్పటికే ఆమె చనిపోయినట్లు నిర్ధారించారు. అయితే తను గత రెండు రోజుల నుండి చెవి, కడుపు నొప్పితో బాధపడుతుందని తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.