04-10-2025 09:36:28 PM
గద్వాల (విజయక్రాంతి): ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని ఓ కానిస్టేబుల్ యువతిని నమ్మించి శారీరకంగా వాడుకుని మోసం చేయడంతో మనస్థాపానికి గురైన యువతి ఆత్మహత్య చేసుకుంది. గద్వాల్ జిల్లాలోని గట్టు పోలీసు స్టేషన్ పరిధిలోని చిన్నోనిపల్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఖమ్మం జిల్లాకు చెందిన ప్రియాంక, చినోన్నిపల్లి గ్రామానికి చెందిన కానిస్టేబుల్ రఘునాథ్ గౌడ్ చదువుకునే కోచింగ్ వద్ద కొన్నేళ్లుగా ప్రేమ వ్యవహారం కొనసాగింది. తనను పెళ్లి చేసుకోవాలని ఆ యువతి రెండు నెలల క్రితం చిన్నోనిపల్లి గ్రామానికి రాగా పెళ్లికి కానిస్టేబుల్ రఘునాథ్ గౌడ్ నిరాకరించడంతో అప్పట్లోనే ఆమె గద్వాల జిల్లా పోలీసులను ఆశ్రయించింది. చీటింగ్ కేసు నమోదు కాగా అతను జైలుకు వెళ్లి ఇటీవల విడుదల అయ్యాడు.
అప్పటి నుంచి అతని ఇంట్లోనే ఆ యువతి నివసిస్తోంది. పెళ్లి చేసుకోవాలని మరోసారి కోరగా యువకుడు నిరాకరించడంతో రెండు రోజుల క్రితం ప్రియాంక పురుగుల మందు సేవించింది. గద్వాల ఆసుపత్రిలో చికిత్స అనంతరం తిరిగి ఆ గ్రామానికి చేరుకున్న యువతి శనివారం ఉదయం మృతి చెందింది. ఆమె మరణంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రియాంక మృతికి కారణమైన రఘునాథ్ గౌడ్ పై పూర్తిస్థాయిలో విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న కానిస్టేబుల్ రఘునాథ్ గౌడ్ విధుల నుంచి శాశ్వతంగా తొలగిస్తున్నట్లు ఈ మేరకు ఎస్పీ తెలిపారు.