యువత, విద్యార్థులు డ్రగ్స్ బారిన పడొద్దు
తాండూరు, మార్చి 6 (విజయక్రాంతి): విద్యార్థులు, యువత డ్రగ్స్ బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని.. డ్రగ్స్ కు అలవాటు పడితే ఆరోగ్యం క్షీణించి కుటుంబం చిన్నా భిన్నమై సమాజం పై తీవ్ర ప్రభావం పడుతుందని వికారాబాద్ జిల్లా తాండూర్ డిఎస్పి యాదయ్య, ఎక్సైజ్ సీఐ రాణి అన్నారు.
శుక్రవారం ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక, 99 రోజుల కార్యక్రమాన్ని ప్రారంభించారు .పిల్లల భద్రత డ్రగ్స్ కు అడ్డుకట్ట అనే అంశంపై ఇందిరా చౌక్ నుండి రైల్వే స్టేషన్ వరకు విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు, ఎక్సైజ్ శాఖ అధికారులు మాట్లాడుతూ యువత మరియు విద్యార్థులు మత్తు పదార్థాల బారిన పడకుండా సమాజంలోని ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
డ్రగ్స్ వినియోగం వ్యక్తిగత జీవితాన్ని మాత్రమే కాకుండా కుటుంబాలు మరియు సమాజాన్ని కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తుందని తెలిపారు. ప్రజలు తమ పరిసరాల్లో మత్తు పదార్థాల కు సంబంధించిన ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాలు గమనించినట్లయితే వెంటనే యాంటీ నార్కోటిక్స్ టోల్ ఫ్రీ నెంబర్ 1908 కు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో నార్కోటిక్స్ ఈగల్ ఫోర్స్ సీఐ భాస్కర్ రెడ్డి, ఎంపీడీవో విశ్వ ప్రసాద్, సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్థానిక ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు




