10-06-2025 12:00:00 AM
చారకొండ, జూన్ 9 : ప్రజా ప్రభుత్వంలో స్థానిక నాయకుల తీరుతో నిజమైన నిరుపేదలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని యూత్ కాంగ్రెస్ నాయకుడు పర్శమోని మహేష్ విమర్శించారు. సోమవారం మండలంలోని తుర్కలపల్లి గ్రామ పంచాయితీ ముందు గ్రామానికి చెందిన యూత్ కాంగ్రెస్ నాయకుడు పర్శమోని మహేష్ తనకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ టెంట్ వేసి నిరాహార దీక్షకు పూనుకున్నాడు.
ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్లలో స్థానిక నాయకులు ప్రోద్బలంతో అనర్హులకు కేటాయించి తమలాంటి నిరుపేద కుం టుంబానికి మొండి చేయి చూపుతున్నారని విమర్శించారు. మొదట్లో విడుదల చేసిన ఇందిరమ్మ ఇండ్ల అర్హుల జాబితాలో తన పేరు ఉన్నప్పటికీ చివరకు మంజూరు అయిన జాబితాలో పేరు లేకుండా చేశారని ఆరోపించారు.
తన తండ్రి 17 ఏళ్ల క్రితం పక్షవాతంతో కాలు, చేతులు పడిపోవడంతో తమ కుటుంబం ఎంతో ఇబ్బందులు పడుతొందని చాలా సంవత్సరాలుగా యూత్ కాంగ్రెస్ లో పని చేస్తున్నానని కాంగ్రెస్ పార్టీ వస్తేనే పేదలకు న్యాయం జరుగుతుందని గత ఎన్నికల్లో ఎంతో కష్టపడి ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటే తమలాంటోళ్ళకే అన్యాయం జరిగితే ఎవరికి చెప్పుకోవాలని వాపోయాడు.
దీక్ష విషయం తెలుసుకుని స్థానిక నాయకులు రెండో విడతలో ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తామని దీక్ష విరమించాలని ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. త మలాంటి పేదలకు న్యాయం జరిగే వరకూ నా పోరాటం కొనసాగిస్తానని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నిజమైన లబ్ధిదారులకు అందించాలనికోరారు.