calender_icon.png 27 June, 2025 | 12:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువత డ్రగ్స్ బారిన పడకుండా చూడాలి

26-06-2025 08:09:32 PM

అది మనందరి బాధ్యత

సిద్దిపేట కలెక్టర్ హైమావతి

హుస్నాబాద్‌లో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా భారీ ర్యాలీ..

హుస్నాబాద్: డ్రగ్స్ బారిన పడి యువత తమ జీవితాలను నాశనం చేసుకోకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి(District Collector Haimavati) అన్నారు. వారి జీవితాలను సరైన మార్గంలో పెట్టేందుకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని ఆమె పిలుపునిచ్చారు. గురువారం ఆమె హుస్నాబాద్ లో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నిర్మూలన దినోత్సవం(Anti-Drug Day) సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ గరిమా అగ్రవాల్‌ పాల్గొన్నారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక నిరోధక దినోత్సవాన్ని 1987లో ప్రారంభించి, ప్రతి సంవత్సరం జూన్ 26న జరుపుకుంటున్నట్టు తెలిపారు.

యువత డ్రగ్స్ బారిన పడకుండా వారిలో అవగాహన పెంచడానికి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఎక్కడైనా డ్రగ్స్ రవాణా జరుగుతున్నట్టు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించడం అందరి బాధ్యత అన్నారు. యువత మాదక ద్రవ్యాలకు బానిసలవ్వకుండా తమ జీవితాన్ని ఉన్నత మార్గంలో పయనించేలా చేసుకోవడంతో పాటు, తమ స్నేహితులు, శ్రేయోభిలాషులను కూడా సన్మార్గంలో పయనించేలా చూడాలని ఆమె పిలుపునిచ్చారు. జిల్లాలో మాదక ద్రవ్యాలకు లోనై ఇబ్బందులు పడేవారికి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని డ్రగ్ అడిక్షన్ సెంటర్ ద్వారా కౌన్సిలింగ్, వైద్య సేవలు అందిస్తున్నట్టు కలెక్టర్ తెలిపారు.